ఊహించినట్లుగానే చంద్రబాబు బంతిని మోడీ కోర్టులోకి నెట్టేశారు
అమరావతి: కాపులకు విద్య, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నప్పుడు పెద్దగా ఒరిగిపోతుందని ఎవరూ ఊహించలేదు. కోటా కాపుల జేబుల్లో పడిపోతుందని కూడా అనుకోలేదు.
కెసిఆర్ దారిలోనే చంద్రబాబు: కాపు కోటాపై దులుపేసుకోవడమే..
కేంద్రం మీదికి నెట్టడానికి అవసరమైన ప్రాతిపదిక మాత్రమే చంద్రబాబు వద్ద ఉందని అందరికీ తెలుసు. అనుకున్నట్లుగానే చంద్రబాబు చేసేశారు. కాపు రిజర్వేషన్ల బంతిని ఆయన ప్రధాని నరేంద్ర మోడీ కోర్టులోకి విసిరేశారు.
కాపు రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం: బాబు ఏమన్నారంటే..?, ఎస్టీల్లోకి బోయ, వాల్మీకి
పెద్దగా సమయం కూడా తీసుకోలేదు...
బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టడానికి చంద్రబాబు ఎక్కువ సమయం కూడా తీసుకోలేదు. రాష్ట్ర శాసనసభ శనివారం కాపు రిజర్వేషన్ల బిల్లును ఆమోదించింది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. రిజర్వేషన్లు 50 శాతం దాటితే కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని చెప్పేశారు.
తాను చేయాల్సిందంతా చేసేశానని...
కాపులకు రిజర్వేషన్లు కల్పించడానికి తాను చేయాల్సిందంతా చేశానని చెప్పుకోవడానికి మాత్రమే చంద్రబాబుకు అవకాశం ఉంది. కాపు రిజర్వేషన్ల గురించి అడిగే వారు కేంద్రం వద్దకు వెళ్లాలని ఆయన సూచించే అవకాశం కూడా లేకపోలేదు. 50 శాతం మించితే రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యం కాదనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికీ తెలుసు. చంద్రబాబుకు తెలియదని అనుకోలేం. అయినా చేసి పారేశారు.
అప్పుడలా చెప్పేశారు...
ముద్రగడ పద్మనాభం ఆందోళన చేస్తున్న సమయంలో చంద్రబాబు ఓ మాట అన్నారు. దాన్ని శనివారం శాసనసభలో కూడా ప్రస్తావించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయడం పెద్ద పని కాదని, కానీ అమలు కావని గత ప్రభుత్వ అనుభవం తెలియజేస్తుందని అన్నారు. రిజర్వేషన్లు పక్కాగా అమలయ్యే విధంగా ఒక విధానాన్ని రూపొందించి, సక్రమమైన విధానం అవలంబిస్తామని కూడా అప్పట్లో చెప్పారు. అందుకు చర్యలు తీసుకుంటూ మంజునాథ కమిషన్ కూడా వేశారు.
కాపు కోటాపై మరో వివాదం ఇలా...
జస్టిస్ మంజునాథ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా వివాదంగా మారే అవకాశం కనిపిస్తోంది. బీసీ కమిషన్ సభ్యులు తనను సంప్రదించకుండా, తనకు తెలియజేయకుండా బిసి కమిషన్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారని బిసి కమిషన్ ఛైర్మన్ జస్టిస్ మంజునాథ చెప్పారు. మంజునాథ్ను సంప్రదించకుండా నివేదికను ఎందుకు సమర్పించాల్సి వచ్చిందో, మంజునాథ్ను ఎందుకు పక్కన పెట్టారో ఎవరికీ తెలియదు.