వైద్యులను రక్షించలేని స్థితిలో రాష్ట్రం ఉందా ? చంద్రబాబు ప్రశ్న .. మీ తీరు రాజకీయాలకే మచ్చ .. సజ్జల
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తెనాలి ఆసుపత్రిలో రోగులకు వైద్య సేవలందిస్తూ కరోనా వైరస్ బారినపడి మృతి చెందిన వైద్యుడ్ని ఉద్దేశించి, రాష్ట్రంలో కరోనా పరిస్థితులను గురించి సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఏమిటీ అమానుషం, ఎందుకీ నిర్లక్ష్యం అంటూ వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. చంద్రబాబు వ్యాఖ్యలకు సజ్జల రామ కృష్ణా రెడ్డి రివర్స్ కౌంటర్ ఇచ్చారు .

వైద్యుల ప్రాణాలు కాపాడలేని స్థితిలో ఏపీ ప్రభుత్వం
తెనాలి ఆసుపత్రిలో రోగులకు వైద్య సేవలందిస్తూ కరోనా బారినపడి " నా బిడ్డల కోసం బతకాలి మెరుగైన చికిత్స అందించే బతికించండి" అని వేడుకున్న వైద్యుడి ప్రాణాలు కూడా నిలపలేని స్థితిలో రాష్ట్రం ఉండటం శోచనీయమని చంద్రబాబు పేర్కొన్నారు. అంతేకాదు మర్యాద లేని చోట పని చేయలేమంటూ వైద్యుల సంఘం సిఎస్ కు లేఖ రాయడం రాష్ట్రంలో దుస్థితికి నిదర్శనం చంద్రబాబు విమర్శించారు.

డాక్టర్లపై వేధింపులు ... బాబు విమర్శలు
సమీక్ష సమావేశానికి కాస్త ఆలస్యంగా వచ్చినందుకు ప్రకాశం అనంతపురం డీఎంహెచ్వో వ్యక్తిగతంగా దూషించారు . శ్రీకాకుళం నెల్లూరు డి ఎం హెచ్ ఓలు పని చేయలేకపోతున్నట్లుగా వైద్యుల సంఘం లేఖలో ఆవేదన వెలిబుచ్చారు. విజయవాడ, నెల్లూరు, తెనాలిలో డాక్టర్లు మరణించినా ఇంతవరకు నష్టపరిహారం ప్రకటించలేదని వాపోయారు. మాస్కుల కోసం విశాఖలో డాక్టర్ల ధర్నా... రక్షణ పరికరాల కోసం ఒంగోలులో ల్యాబ్ టెక్నీషియన్ ల ధర్నా... మాస్కులు అడిగాడని డాక్టర్ సుధాకర్ పై కక్షగట్టి నడిరోడ్డుపై లాఠీలతో కొట్టించారు అంటూ చంద్రబాబు రాష్ట్రంలో డాక్టర్ల పరిస్థితిని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

కరోనా రికవరీ లో ఏపి అట్టడుగున ఉండటం చూస్తే బాధిస్తుంది
కరోనా రికవరీ లో ఏపి అట్టడుగున ఉండటం చూస్తే బాధిస్తుందని ఇదే సమయంలో మరో వైపు ఫ్రంట్ లైన్ వారియర్స్ పై నిర్లక్ష్యం ఆవేదన కలిగిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇవి చాలవన్నట్టు కరోనా కిట్ల స్కామ్, బ్లీచింగ్ పౌడర్ కుంభకోణాలతో వైసీపీ నేతల అవినీతి వ్యాప్తి కరోనాతో పోటీపడుతోంది అంటూ చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. కరోనా విధుల నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వైద్యులు, సిబ్బందికి ప్రభుత్వం వెంటనే పరిహారం అందించాలి. వైద్యులకు, సిబ్బందికి ప్రత్యేక భద్రతా పరికరాలు అందించాలి అంటూ డిమాండ్ చేశారు .

చంద్రబాబు తీరు రాజకీయాలకే మచ్చ అన్న సజ్జల
దీని పై మండిపడిన సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు తీరు రాజకీయాలకే మచ్చ అని మండిపడ్డారు. తెనాలి ప్రభుత్వ డాక్టర్ మరణాన్ని చంద్రబాబు రాజకీయాల కోసం వాడుకుంటున్న తీరు విస్మయం కలిగిస్తుంది అన్నారు విపత్తులను కూడా రాజకీయం చేసే పచ్చి స్వార్ధపు మనిషి చంద్రబాబు అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వైద్యుడి ప్రాణాలను కాపాడలేని స్థితిలో రాష్ట్రం ఉండడం శోచనీయమని విమర్శలు చేసిన చంద్రబాబు వ్యాఖ్యలను తిప్పికొట్టారు సజ్జల రామకృష్ణారెడ్డి .

ఓర్వలేక దిగజారి వ్యాఖ్యలు చేస్తున్న బాబు అంటూ సజ్జల ఫైర్
డాక్టర్ ప్రేమ్ కుమార్ కరోనా పేషెంట్ లకు చికిత్స అందించలేదని, దురదృష్టవశాత్తు ఆయనకు కరోనా సోకిందని, అయితే ఆయన డయాబెటిక్ కావడంతో మృతి చెందారని సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అంతేకాదు కరోనా పై యుద్ధం చేస్తున్న వారికి 50 లక్షల రూపాయల పరిహారాన్ని ఇస్తామని చెప్పిన విషయం చంద్రబాబుకు తెలియదా ? ఎక్కడైనా ఏదైనా జరిగితే కేంద్రం ఇచ్చే వరకు వెయిట్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చేస్తోంది. చంద్రబాబు నాయుడు కరోనా నివారణ చర్యల్లో రాష్ట్రం అగ్ర స్థానంలో ఉండటాన్ని చూసి ఓర్వలేక దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications