Chandrababu : అమరావతిపై కేంద్రం తాజా అడుగులు- చంద్రబాబు రియాక్షన్ ఇదే..!
ఏపీలో విభజన చట్టానికి అనుగుణంగానే అమరావతి రాజధాని ఏర్పాటైందని కేంద్రం నిన్న పార్లమెంటుతో పాటు సుప్రీంకోర్టులో ఇచ్చిన స్పష్టతపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్రం తాజాగా పలు నిర్ణయాలు తీసుకుంటోంది. పార్లమెంటులో వైసీపీ ఎంపీ సాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా విభజన చట్టం ప్రకారమే అమరావతి రాజధాని ఏర్పాటైనట్లు చెప్పిన కేంద్రం.. ఈ మేరకు సుప్రీంకోర్టులోనే అదే వాదనతో అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై అమరావతి నిర్మాత చంద్రబాబు స్పందించారు.
చట్టాన్ని గౌరవిస్తామని అందరం ప్రమాణ స్వీకారం చేస్తారని, కానీ దానికి విరుద్ధంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. లేని అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారని, విధ్వంసానికి దిగితే కోర్టులు, ప్రజలు, మేధావులు కానీ దాన్ని కరెక్ట్ చేయలేని పరిస్థితి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలో స్పష్టం చేశారని, పదేళ్ల తర్వాత ఏపీకి కొత్త రాజధాని వస్తుందన్నారని చంద్రబాబు తెలిపారు.

ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినట్లు కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయడంపై చంద్రబాబు స్పందించారు. విభజన తర్వాత ఆర్నెల్లలోగా ఒక కమిటీని వేశామని, ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చాక కేంద్ర ప్రభుత్వానికి పంపించామన్నారు. ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినట్లు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిందన్నారు. చట్టప్రకారం అమరావతిలో అన్నీ పూర్తి చేయాలని వైసీపీ సర్కార్ ను డిమాండ్ చేశారు. రాజధాని అమరావతి ఎంపిక రహస్యంగా జరగలేదని, రాజధానిగా అమరావతిని మెజారిటీ ప్రజలు ఆమోదించారని చంద్రబాబు గుర్తుచేశారు.
ప్రధాని మోడీ ఎంతో భక్తితో పూజలు చేసి యమునా జలం, పార్లమెంట్ మట్టి అమరావతికి తీసుకొచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు. మీ వెంట పార్లమెంట్ ఉంటుందని భరోసా ఇచ్చారన్నరు. ఫారెస్ట్ ల్యాండ్ కూడా వాడుకోవచ్చని యాక్ట్ లో పెట్టి అమరావతిని నిర్మించామన్నారు. అమరావతిని మార్చబోమని వైసీపీ నేతలు మాట ఇచ్చారని, అమరావతిని టీడీపీ కంటే బాగా అభివృద్ధి చేస్తామని చెప్పారా? లేదా? అని ప్రశ్నించారు. ఆ రోజు ఓట్ల కోసం చెప్పి ఎన్నికల్లో గెలిచారని, ఇప్పుడు గెలిచాక చట్టానికి ఎన్ని తూట్లు పొడవాలో అన్ని పొడిచారన్నారు.

చట్టాలు చేసే హక్కు శాసనసభకు లేదా అంటూ వక్రీకరించి మాట్లాడారని వైసీపీ నేతల్ని చంద్రబాబు విమర్శించారు. కౌన్సిల్ ఛైర్మన్ మతం, కులం పేరుతో బూతులు తిట్టారని, కౌన్సిల్ను రద్దు చేయడానికి అసెంబ్లీలో బిల్లు పెట్టారని గుర్తుచేశారు. మళ్లీ కొన్నాళ్లకు కౌన్సిల్ రద్దును మర్చిపోయారన్నారు. ప్రపంచంలో ఎక్కడా జరగని ప్రయోగం ఇది అన్నారు. 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 34 వేల ఎకరాల్ని రాజధానికి ఇవ్వడం ఇదే తొలిసారి అని చంద్రబాబు తెలిపారు. వెయ్యి రోజులకుపైగా అమరావతి రైతాంగం పోరాడుతోందని, న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్రను ఇబ్బంది పెట్టారని చంద్రబాబు విమర్శించారు. ప్రజాకోర్టులో జగన్మోహన్రెడ్డిని దోషిగా నిలబెట్టేదాకా తెలుగుదేశం పార్టీ పోరాడుతుందన్నారు, జగన్కు ప్రజా జీవితంలో ఉండటానికి అర్హత లేదన్నారు.












Click it and Unblock the Notifications