జగన్ పార్టీ వైపు ఎన్టీఆర్: తేలిగ్గా తీసుకున్న బాబు
హైదరాబాద్: నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ప్రచారం చేస్తారనే వార్తలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తేలిగ్గా తీసుకున్నట్లే కనిపించారు. గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన ప్రతిస్పందించిన తీరు గమనిస్తే దానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వదలుచుకోలేదని అర్థమవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ మీద వచ్చిన వార్తలను మీడియా ప్రతినిధులు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు.
ఆ వార్తలపై నో కామెంట్ అని అంటూనే ఎవరు ఏమైనా చేసుకునే స్వేచ్ఛ ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కుప్పం నుంచి జగన్ తన యాత్రను తలపెట్టడంపై కూడా ఆయన ప్రతిస్పందించారు. కుప్పంను అపవిత్రం చేస్తారనే ఉద్దేశంతోనే జగన్ను అడుగు పెట్టనివ్వదని తాను చెప్పినట్లు ఆయన తెలిపారు. కుప్పం ప్రజలు నిజాయితీపరులని ఆయన అన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస రావుకు వైయస్ జగన్ వచ్చే ఎన్నికల్లో లోకసభ సీటు లేదా శాసనసభ సీటు ఇస్తానని హామీ ఇచ్చారని, ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ వైయస్సార్ కాంగ్రెసుకు వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ చాలా కాలంగా చంద్రబాబుకు దూరంగా ఉంటున్నారు. దాంతో ఆయన పార్టీకి కూడా దూరం కావచ్చుననే అభిప్రాయం స్థిరపడింది.
శాసనసభ ప్రోరోగ్ వంటి సాధారణ విషయాన్ని కూడా కాంగ్రెసు నాయకులు వివాదం చేస్తున్నారని చంద్రబాబుమీడియా సమావేశంలో అన్నారు.












Click it and Unblock the Notifications