ఆసుపత్రిలో ఫ్లూయిడ్స్కు బాబు నో, గేటు దూకిన ఎంపి
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఫ్లూయిడ్స్ తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. తెలుగు ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎపి భవన్లో ఐదు రోజులుగా చేస్తున్న చంద్రబాబు ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు శుక్రవారం భగ్నం చేసి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఆయనకు ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు వైద్యులు ప్రయత్నించగా బాబు నిరాకరించారు. తాను ఆసుపత్రిలోనే దీక్ష చేస్తానని చెప్పారు.
సోనియా ఇంటి ముట్టడికి యత్నం, అరెస్ట్
బాబు దీక్షను భగ్నం చేసిన నేపథ్యంలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటిని ముట్టడించేందుకు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు, ఎంపీలు, కార్యకర్తలు బయలుదేరారు. దీక్షా ప్రాంగణం నుండి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ఈ దశలో ఎంపి సిఎం రమేష్ గేటు పైనుండి దూకారు.
సోనియా ఇంటికి టిడిపి శ్రేణులు వెళ్లకుండా ఉండేందుకు ఆ దారిలో పోలీసులు బారీకేడ్లను ఏర్పాటు చేశారు. ఇండియా గేట్ వరకు చేరుకున్న తర్వాత పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. దీంతో పోలీసులు వారని అదుపులోకి తీసుకున్నారు.
కాగా అంతకుముందు టిడిపి నేత పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ... బాబు దీక్షను బలవంతంగా భగ్నం చేయడంపై మండిపడ్డారు. సమన్యాయం గురించి ఆలోచించకుండా విభజనపై నిర్ణయం తీసుకున్న సోనియా ఇంటిని ముట్టడిస్తామని చెప్పారు. తమ కార్యకర్తలు ఇప్పటికే టెన్ జనపథ్ ముట్టడికి బయలుదేరారని చెప్పారు.