జైలుకెళ్లా, టీ మిగులు ఘనత నాదే: చంద్రబాబు
హైదరాబాద్: తెలంగాణలో సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసింది తామేనని, తెలంగాణను అభివృద్ది చేసింది తామేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బాబ్రీ ప్రాజెక్టుపై పోరాటం చేసి తొలిసారి తన జీవితంలో జైలుకు వెళ్లానని ఆయన గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో మిగులు బడ్జెట్ తన వల్లనే సాధ్యమైందని, తాము అభివృద్ధి చేయడం వల్లనే ఈ రోజు తెలంగాణ మిగులులో ఉందని ఆయన అన్నారు.
పార్టీ శాసనసభ్యులు, ఇంచార్జీల సమావేశంలో ఆయన శుక్రవారంనాడు ప్రసంగించారు. తెలుగు బిడ్డ ప్రధాని అయ్యాడని పివి నర్సింహారావుపై నంద్యాలలో ఎన్టీ రామారావు టిడిపి అభ్యర్థిని పోటీకి దింపలేదని ఆయన అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఎన్టీ రామారావు నాంది పలికారని ఆయన అన్నారు.

తెలంగాణలో ఈ రోజు వ్యవసాయం బాగుండడానికి ఎన్టీ రామారావు విద్యుచ్ఛక్తిపై ఇచ్చిన రాయితీలే కారణమని ఆయన అన్నారు. తాము ఓడినా గెలిచినా భయపడబోమని ఆయన అన్నారు. హైదరాబాదును అభివృద్ధి చేసింది తామేనని, హైదరాబాదులో సంపద పెంచి ఆదాయాన్ని పెంచామని ఆయన అన్నారు. హైదరాబాదు ఇమేజ్ను కాంగ్రెసు సర్వనాశనం చేసిందని ఆయన అన్నారు.
తెలంగాణ సమస్యల పరిష్కారానికి తాము పోరాటాలు చేశామని ఆయన చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో హైదరాబాద్ ఆస్తులను తామే కాపాడమని ఆయన అన్నారు. సెజ్ల పేరిట ఆస్తులను వైయస్ ప్రభుత్వం దారాదత్తం చేస్తుంటే తాము పోరాటం చేశామని, మిగతావాళ్లు ఎవరూ రాలేదని ఆయన అన్నారు. తెలంగాణలోని కార్యకర్తలను తాను ఏనాటికీ మరిచిపోలేనని ఆయన అన్నారు.
అధికారంలోకి తెచ్చే వరకు తెలంగాణలోనే..
తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చే వరకు ఎక్కడికీ వెళ్లనని, ఇక్కడే ఉండి పాలిస్తానని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణను తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని, సున్నితమైన సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని కోరానన్నారు. కార్యకర్తలను అన్ని రకాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా బాబు హామీ ఇచ్చారు. హామీలు నెరవేర్చే వరకు తెరాస ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కార్యకర్తలకు బాబు పిలుపునిచ్చారు. మంచి పనులకు సహకరిస్తానని, చెడు పనులను వదిలేదిలేదని ఆయన అన్నారు. వారంలో ఒ కరోజు తెలంగాణకు కేటాయిస్తానని, గతంలో కంటే ఎక్కువగా తెలంగాణలో పర్యటిస్తానని చంద్రబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications