కరోనా టెస్టులు మాయా..కుంభకోణమా!! తేల్చాలన్న చంద్రబాబు.. ఘాటుగా సమాధానం ఇచ్చిన సర్కార్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం కరోనా టెస్టులలో రికార్డు సృష్టించింది. ఏపీలో 10 లక్షల కరోనా టెస్టులు నిర్వహించామని ,1మిలియన్ టెస్టులతో ఏపీ రికార్డు సాధించిందని వైసిపి ప్రభుత్వం చెప్పుకుంటుంటే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పై పలు ఆరోపణలు చేశారు. దీనికి ప్రభుత్వం కూడా ధీటుగానే సమాధానం ఇచ్చింది.
కరోనా పరీక్షలు గణాంకాల విషయంలో కేంద్రానికి తప్పుడు నివేదికలు
కరోనా విషయంలో ఏపీ ప్రభుత్వం మొదటి నుంచి ప్రజలను మోసం చేస్తుందని, కేంద్రాన్ని కూడా తప్పుదారి పట్టిస్తున్నారని,తప్పుడు లెక్కలు చెబుతోందని ఆయన ఆరోపించారు. కరోనా పరీక్షలు గణాంకాల విషయంలో కేంద్రానికి కూడా తప్పు లెక్కలు చెబుతున్నారని చంద్రబాబు విమర్శించారు. అంతేకాదు ఏపీలో వైయస్ జగన్ ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా మోసం చేస్తోందని, కరోనా పరీక్షలు ఇవ్వకున్నా శాంపిల్ ఇచ్చినట్టుగా చాలామందికి ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఒక వీడియోను పోస్ట్ చేసిన చంద్రబాబు అందులో మోసాలను పేర్కొన్నారు.
ఇది మాయనా ? కుంభకోణమా... కేంద్రం పరిశీలించాలి
అనంతపురం నుండి వీడియో వచ్చిందని, కరోనా పరీక్షలు శాంపిల్స్ ఇవ్వని వ్యక్తులకు కూడా కరోనా టెస్టుల మీ ఫలితం ఇది అంటూ ఫోన్లకు సందేశాలు వస్తున్నాయని ఆ వీడియోలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇంతటి నీచానికి దిగజారుతుండటం నిజంగా షాక్ కు గురి చేసిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక ఏపీ ప్రభుత్వం చెబుతున్న ఒక మిలియన్ కరోనా టెస్టుల గణాంకాలు కేవలం మాయ అయినా అయ్యుండాలి లేదా కుంభకోణం అయినా అయి ఉండాలి అంటూ చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు.ఇదే సమయంలో కేంద్రానికి కూడా చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.
రాకెట్ వెనుకున్న గుట్టు రట్టు చెయ్యాలి
ఏపీలో జరిగిన కరోనా టెస్ట్ ల విషయంలో కేంద్రం దృష్టి సారించాలని కోరారు. నిజంగా ఒక మిలియన్ టెస్ట్ లు చేసిందో లేదో పరిశీలించాలని, టెస్టులు చేశామంటూ ఫోన్లకు సందేశాలు పంపే ప్రభుత్వ ప్రోద్బలంతో పని చేస్తున్న రాకెట్ వెనుకున్న గుట్టు రట్టు చేయాలని, వారి మోసపూరిత ఉద్దేశాలను బయటపెట్టాలని చంద్రబాబు తన పోస్ట్ లో పేర్కొన్నారు.కరోనా పరీక్షల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు నెగిటివ్ అని ,నెగిటివ్ వచ్చిన వ్యక్తులకు పాజిటివ్ అని రిపోర్టులు తారుమారు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో చంద్రబాబు కూడా కరోనా పరీక్షలు విషయంలో పారదర్శకత లేదని, అంతా మోసాలే వెలుగు చూస్తున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం జోక్యం చేసుకోవాలని, ప్రభుత్వ గణాంకాలను పరిశీలించాలని కోరారు.
చంద్రబాబు ఆరోపణలకు ధీటుగా బదులిచ్చిన సర్కార్
చంద్రబాబు ట్వీట్ కు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. కరోనా పరీక్ష చేయించుకున్న వ్యక్తి సంబంధిత అధికారులకు ఏ ఫోన్ నెంబర్ ఇచ్చాడో ఆ ఫోన్ నెంబర్ కే ఫలితాలతో కూడిన ఎస్ఎంఎస్ వెళుతుందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఒకవేళ కరోనా టెస్టులు చేయించుకున్న వ్యక్తి తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చినా, లేక మరొకరి నెంబర్ ఇచ్చినా ఆ నెంబర్ కే ఎస్ఎంఎస్ వెళుతుందని అంతే తప్ప పరీక్షలు లేకుండానే ఫలితాలు ఇవ్వటం జరగదని క్లారిటీ ఇచ్చింది . కరోనా టెస్టుల ఫలితాలను సత్వరమే తెలియజేసి ప్రజల్లో భయాందోళనలు తగ్గించడానికి వీలుగా వినూత్నరీతిలో ఈ ఎస్ఎంఎస్ విధానాన్ని తీసుకువచ్చామని అయితే, ఒక మిలియన్ సందేశాల్లో ఏవో కొన్ని సందేశాలను తప్పుబట్టడం, అది కూడా ప్రభుత్వం వైపు నుంచి పొరబాటు లేకపోయినా ప్రభుత్వానికి తప్పులు అంటగట్టడం ప్రతిపక్ష పార్టీకి మంచిది కాదని పేర్కొన్నారు.