నాకు ఇంగ్లీష్ రాదంటావా, గుర్తు లేదా...: జగన్పై విరుచుకుపడిన చంద్రబాబు
విశాఖపట్నం: తనకు ఇంగ్లీష్ రాదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా విరుచుకుపడ్డారు. శ్రీవెంకటేశ్వర వర్సిటీలో పీజీ అనంతరం డాక్టరేట్ చేశానని ఆయన చెప్పారు.
పాలనలో తన సత్తా ఏమిటో ప్రపంచానికి తెలుసునని, హైదరాబాద్ను గొప్ప ఆర్థిక నగరంగా తీర్చిదిద్దిన విషయం గుర్తు లేదా అని ఆయన ప్రశ్నించారు. విశాఖపట్నంలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
మహా నాయకుడు ఎన్టీరామారావు ఎనిమిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారని, తాను తొలిసారి తొమ్మిదేళ్లు... ఇప్పుడు రెండున్నరేళ్లగా ముఖ్యమంత్రిగా వున్నానని ఆయన గుర్తు చేసారు. కానీ వైఎస్ ఐదేళ్లు సీఎంగా చేసి పేపరు పెట్టారు... ఇప్పుడా పేపరు తప్పుడు రాతలు రాస్తోందని అన్నారు.
"మీ పిల్లలు మంచిగా బతకాలి. దొంగతనం, తప్పుడు పనులు చేయకూడదని మీరు కోరుకుంటారు. అలాఅయితే వైసీపీ సభలకు వారిని పంపవద్దు" అని ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.
4 లక్షల ఇళ్లు నిర్మిస్తాం
రాష్ట్రంలో పేదల కళ్లలో ఆనందం చూడాలన్నదే తన లక్ష్యమని చంద్రబాబు చెప్పారు రెండున్నరేళ్లుగా రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్న పేదవాళ్లను అన్ని విధాలా ఆదుకునేందుకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, అభివృద్ధి జరిగితే ఆనందం వస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాలుగు లక్షల ఇళ్లు నిర్మిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
పరవాడలో ప్రారంభించిన కాలనీకి దివంగత ఎన్టీరామారావు భార్య బసవతారకం పేరు పెట్టామని చెప్పారు. పట్టణాల్లో నివసిస్తున్న పేదలకు పట్టాల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పేద కుటుంబాలను ఆదుకునేందుకు వచ్చే నెల నుంచి చంద్రన్న బీమా పథకం అమలు చేస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో అంటువ్యాధులపై యుద్ధం ప్రకటించామని, డెంగ్యూ, మలేరియా, ఇతర జ్వరాలపై ప్రజలు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు.