వారే భయపడ్డంలేదు, నేనెందుకు భయపడ్తా: జగన్ను ఏకేసిన బాబు
విజయవాడ: ప్రత్యేక హోదా విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏకిపారేశారు. కేసులున్నవారే భయపడడం లేదు, తానెందుకు భయపడుతానని అన్నారు. "నాకు భయమేమిటి, నేను ఎందుకు భయపడుతా" అని ఆయన అన్నారు.
తాను ఏ తప్పూ చేయలేదని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ప్రధాని మోడీని నిలదీయడానికి చంద్రబాబు భయపడుతున్నారనే జగన్ వ్యాఖ్యపై ఆయన ఆ విధంగా ప్రతిస్పందించారు. సభలో అరుణ్ జైట్లీ మాట్లాడుతున్నప్పుడు వైసిపి ఎంపీలు ఎక్కడున్నారని ఆయన అడిగారు.
జైట్లీ తనతో మాట్లాడారని, మీరం చేస్తారో చెప్పాలని కోరానని ఆయన చెప్పారు. ప్రజలు ఆందోళనలో ఉన్నారని చెప్పానని, ఎన్ని సార్లు కలిసినా ఫలితం లేకుండా పోయిందని చెప్పానని ఆయన అన్నారు. జైట్లీ తన మాటను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తమ పార్టీ ఎంపీలు ప్రధానిని, ఇతర ముఖ్యులను కలిసి మాట్లాడుతారని ఆయన చెప్పారు.
బంద్ పిలుపుతో మేలేమిటని ఆయన అడిగారు. మను చేయాల్సింది ఢిల్లీలో గానీ రాష్ట్రంలో కాదని ఆయన అన్నారు. ఇప్పటికే రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉందని, బంద్ వంటి వాటివల్ల మరింత నష్టం జరుగుతుందని, ఆర్టీసికి ఈ రోజు 4 కోట్ల నష్టం వచ్చిందని ఆయన అన్నారు. జగన్ కేంద్రాన్ని ఏమీ అనకుండా తనను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి లేదని చెప్పడానికి జగన్ వ్యాఖ్యలే నిదర్శనమని అన్నారు.
రాజ్యసభలో కాంగ్రెసు డ్రామాలు ఆడింని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తమ పార్టీ రాజీ పడబోదని స్ప్,టం చేశారు. పార్లమెంటులో టిడిపి ఆందోళనకు కాంగ్రెసు సహకారం లభించలేదని అన్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను, సభలో ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయాలని ఆయన అన్నారు. జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేంద్రాన్ని నిలదీయడం లేదని అన్నారు. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి తనపై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు.
టిడిపిని ఇబ్బందుల్లోకి నెట్టడానికి కాంగ్రెసు, వైసిపి ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు. తనకు కూడా బాధ్యత ఉందని, తీసుకునే స్థాయిలో తాను ఉన్నానని, ఇచ్చే స్దాయిలో కేంద్రం ఉందని ఆయన అన్నారు. సామరస్యపూర్వకంగా సమస్యలను పరిష్కరించుకోవాలని చూస్తున్నట్లు తెలిపారు. 125 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెసు పార్టీని ప్రజలు మట్టి కరిపించారని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రాన్ని కాంగ్రెసు ఇటలీ స్వాతంత్ర్య దినోత్సవం రోజు విభజించిందని ఆయన అన్నారు.
జైట్టీ ఇచ్చిన సమాధానంతో ఎపి ప్రజలు మరోసారి ఆందోళనకు గురయ్యారని ఆయన చెప్పారు. రాజ్యసభలో కాంగ్రెసు ఆడిన నాటకం అందరికీ తెలుసునని అన్నారు. ప్రైవేట్ బిల్లు చేసి హంగామా చేశారని అన్నారు.