చంద్రబాబు కసరత్తు: రాజధానికి 29 గ్రామాల్లో 51వేల ఎకరాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో 29 గ్రామాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతాల్లో 1,02,401మంది జనాభా ఉండగా.. 32,143 మంది ఎస్సీలు, 4,663 మంది ఎస్టీలు, 65,592 మంది ఇతరులు ఉన్నారని తేల్చారు.
మొత్తం 51,786 ఎకరాల భూమి ఉండగా, పట్టా భూములు 37,701 ఎకరాలు, దేవాదాయ భూమి 723 ఎకరాలు, అటవీ భూమి 585 ఎకరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రాజధాని ప్రాంతంలో 10,656 వ్యవసాయ కుటుంబాలు ఉండగా, వారిలో 1914 మంది ఎస్సీలు, 417 ఎస్టీలు ఉన్నట్లు పేర్కొన్నారు
ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం కురగల్లు, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, సింగాయపాలెం, వెంకటపాలెం, రాయపూడి గ్రామాల రైతులు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశారు. శనివారం సాయంత్రం చంద్రబాబును కలిసిన పలువురు ప్రకాశం జిల్లా రైతులు రుణమాఫీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇది ఇలా ఉండగా రాజధాని భూములపై సిఎం చంద్రబాబు నాయుడు మంత్రులు, ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. భూమి ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లింపుపై విధివిధానాలను రూపొందించారు. రాజధాని ప్రాంతంలోని భూములను మూడు రకాలుగా విభజించారు. మెట్ట, మగాణి, తరి భూములుగా విభజించారు. వీటి కోసం రూ. 190 కోట్లు కేటాయించారు. రాజధాని ప్రాంతంలో 22,400 మంది రైతులకు భూమి ఉందని గుర్తించారు. భూములిచ్చే రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
నిరుపేదలను ఆదుకోవడమే లక్ష్యం: సిఎం చంద్రబాబు
నిరుపేదలను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపి సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆయన మాట్లాడారు. చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా పింఛన్లు పెంచామని, వికలాంగుల పింఛన్ రూ. 500 నుంచి 1500కు పెంచామని చెప్పారు.
విద్యుత్ వ్యవస్థను గత ప్రభుత్వాలు భ్రష్ఠు పట్టించాయని ధ్వజమెత్తారు. విద్యుత్ కష్టాలను తాను పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. ఇప్పుడు ఉత్పత్తిని, ఉత్సాదకతను పెంచామని వెల్లడించారు. హుధుద్ తుఫాను ధాటికి దెబ్బతిన్న విశాఖలో మూడు రోజుల్లోనే విద్యుత్ పునరుద్ధరించామని తెలిపారు.












Click it and Unblock the Notifications