కందుకూరు ఘటనపై చంద్రబాబు రియాక్షన్ ఇదే .. టీడీపీ శ్రేణులకు కీలక సూచన.. !
ఏపీలో నిన్న చంద్రబాబు రోడ్ షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో 8 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది.దీనిపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది. మరోవైపు పార్టీ నేతల్ని మృతుల అంత్యక్రియలకు సాయంగా ఉంచడంతో పాటు భారీగా పరిహారం కూడా ప్రకటించిన చంద్రబాబు ఈ ఘటనపై మరోసారి స్పందించారు.
ప్రజల్ని చైతన్యవంతం చేసేందుకు కందుకూరు వచ్చామని, ఎక్కడ చూసినా ప్రజలంతా విపరీతంగా నష్టపోయామన్న భావనలో ఉన్నారని చంద్రబాబు తెలిపారు. యువత, మహిళలు పెద్ద ఎత్తున వస్తున్నారని,
అదే సమయంలో నిన్న కొంత ఎమోషనల్ గా తనను చూసేందుకు ముందుకొచ్చారని ఆయన తెలిపారు. నిన్న ఘటన చూస్తే బాధేస్తోందన్నారు. చాలా చోట్ల ఇలాంటివి జరుగుతున్నాయన్నారు. ఉత్సాహంగా వచ్చి సంఘీభావం తెలియజేయడంతో, తాను ఆప్యాయంగా పలకరించేందుకు ప్రయత్నించానన్నారు. అదో దురదృష్టకరమైన ఘటన అన్నారు. ఐస్ క్రీమ్ బండిమీద పడటం, పక్కనే బైక్ లు ఉండి వాళ్లమీద పడటం జరిగిపోయాయని చంద్రబాబు తెలిపారు.

అవాంఛనీయ ఘటనలు జరక్కుండా చూసుకోవాలని చెప్తూనే ఉన్నానని, అయినా భావోద్వేగంలో ఈ ఘటన జరిగిపోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. ఘటన తర్వాత ఆస్పత్రికి వెళ్లి అలర్ట్ చేయడం, ఇతర చర్యలు తీసుకున్నామన్నారు. 8 మంది చనిపోతే, నలుగురికి గాయాలయ్యాయన్నారు. ఇలాంటి ఘటన జరక్కపోతే బావుండేదని గుర్తుచేసుకున్నారు.ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా బాధితుల పిల్లల్ని చదివిస్తామన్నారు. వాళ్లు రాష్ట్రం కోసం త్యాగం చేశారని, ప్రజా చైతన్యం కోసం నేను చేస్తున్న రోడ్ షోల్లో రాష్ట్రం కోసం సమిధలయ్యారని చంద్రబాబు ప్రశంసించారు. ఏదేమైనా ఈ ఉద్యమం కొనసాగుతుందన్నారు.
తాను రాజకీయాల్లో 40 ఏళ్లుగా ఉన్నానని, మొదటి నుంచి కూడా ఎన్టీఆరే చైతన్యరథం ద్వారా రోడ్ షోలు ప్రారంభించారని చంద్రబాబు గుర్తుచేశారు. తాను కూడా చాలాసార్లు రోడ్ షోలు, పాదయాత్రలు, బస్సుయాత్రలు చేశానని, ఎప్పుడునేతలు వచ్చినా పోలీసులు శాంతిభద్రతలు నిర్వహించాల్సి ఉంటుందని, ఎవరినీ నిందించకుండా ఇలాంటివి జరక్కుండా చూడాలని మాత్రమే కోరుతున్నానన్నారు. తనకు సానుభూతి అవసరం లేదని, ఇరుకు వీధుల్లో మీటింగ్స్ పెట్టాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలొస్తున్నారంటూ దాన్నీ విమర్శించడం సరికాదన్నారు. కందుకూరు హాస్పిటల్ జంక్షన్ లో గతంలో చాలా మీటింగ్స్ జరిగాయని, దీనిపైనా విమర్శలు చేసే వారికి వారి అజ్ఞానానికి, అహంకారానికి వదిలిపెడుతున్నానన్నారు. ప్రభుత్వం సహకరించకున్నా మనమే క్రమశిక్షణగా ఉండి సక్సెస్ చేయాలని పార్టీ శ్రేణుల్ని చంద్రబాబు కోరారు. ఇది భావి తరాల కోసం చేస్తున్న యాత్ర అని, వారి త్యాగాల ఫలితానికి మనం న్యాయంచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.












Click it and Unblock the Notifications