ఏపీని కేంద్రం కావాలనే చిన్నచూపు చూస్తోంది...కాపు రిజర్వేషన్లపై పోరాడతా:చంద్రబాబు
పశ్చిమ గోదావరి:ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం అరాకొరా నిధులిచ్చి నాటకాలు ఆడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. కేంద్రానికి కావాల్సిన రాష్ట్రాలకు మాత్రం అన్నీ పనులు చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీని కావాలనే చిన్న చూపు చూస్తోందని దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడపకు ఉక్కు ఫ్యాక్టరీ కోసం కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి మరలా ముందుకు రాకుండా కావాలని నాటకాలాడుతుందోని ధ్వజమెత్తారు. కాపు రిజర్వేషన్ల కోసం కేంద్రంపై పోరాడతామని చంద్రబాబు స్పష్టం చేశారు
చింతలపూడిలో...సిఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా చింతలపూడిలో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు. చింతలపూడి కమ్యూనిటీ ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. చింతలపూడిలో పేదలకు ఇళ్లు నిర్మించే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామన్నారు. పామాయిల్ రైతులను మోసం చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దళారీ వ్యవస్థ లేకుండా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. రెండేళ్లలో ప్రతీ ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
దళారి వ్యవస్థ...నిర్మూలిస్తాం
‘‘నేను ఎవరికీ భయపడను, నా హైకమాండ్ ప్రజలే, నా మీద కావాలని తప్పుడు కేసులు పెట్టారు. ఏమైందో ప్రజలకు తెలుసునని, ఏమీ చేయలేకపోయారని'' ఆయన అన్నారు. తాను నిప్పులా బతికానని అందుకే ఎవరికీ భయపడనని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వానికి అండగా ఉన్నవారిని అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎన్నో చేస్తామని చెప్పి మోసగించిందన్నారు. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా.. దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ప్రథమస్థానంలో ఉన్నామని, ప్రభుత్వంపై నమ్మకంతో గంటలోనే రాజధాని బాండ్లు లిస్టయ్యాయని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి భారీ పరిశ్రమలు రాబోతున్నాయని చంద్రబాబు చెప్పారు.
చేస్తామని చెప్పి...కేంద్రం చేయలేదు
ఏపికి కేంద్రం రూ. 3,900 కోట్లు ఇచ్చి తప్పించుకుందని...రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ. 1000 కోట్లు మాత్రమే ఇచ్చిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దుగ్గరాజపట్నంలో పోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పిన కేంద్రం ఆ హామీ అమలు చేయలేదని చంద్రబాబు దుయ్యబట్టారు. అలాగే విశాఖకు రైల్వే జోన్ ఇవ్వడానికి మీనమేషాలు లెక్కిస్తుందన్నారు. దీనిపై ఒడిషా కూడా తమకు అభ్యంతరం లేదని చెప్పినా కేంద్రం ఇవ్వలేదన్నారు.విశాఖ, అమరావతికి మెట్రో రైలుగానీ, రాపెడ్ రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ.. ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయని ఇవన్నీ కేంద్రం ఇచ్చే పరిస్థితిలో లేదని అన్నారు.
కేంద్రం నాటకాలు...చంద్రబాబు ధ్వజం
విశాఖ-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్ విషయంలో కూడా మోసం చేసిందని, కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ వస్తే ఈ ప్రాంతంలో యువతకు ఉద్యోగాలు వస్తాయని, కాని దాన్ని కూడా కేంద్రం ఇచ్చే పరిస్థితిలో లేదని సిఎం చంద్రబాబు మండిపడ్డారు.ఏపీని చిన్న చూపు చూస్తోందన్నారు. విద్యా సంస్థలు, గిరిజన యూనివర్శిటీ ఇంకా ఏర్పాటు చేయలేదని, గట్టిగా అడిగితే రూ. 650 కోట్లు ఖర్చు పెట్టారని, ఈ విధంగా చేస్తే 20, 30 ఏళ్లు పడుతుందని సిఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి భారీ పరిశ్రమలు రాబోతున్నాయని చంద్రబాబు చెప్పారు.
వైసిపి...అడ్డుపడుతోంది
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లి, కోర్టులో చేతులు కట్టుకుని నిలబడి, బయటకొచ్చి తనను విమర్శిస్తున్నారని, ఇదెక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు.