క్రైస్తవులను బుజ్జగించేందుకు చంద్రబాబు ప్లాన్ .. రంగంలోకి దిగిన దివ్యవాణి .. ఆ వ్యాఖ్యలపై వివరణ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్రైస్తవులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ, మత సామరస్యానికి విఘాతం కలిగించే వ్యాఖ్యలు చేశారంటూ క్రైస్తవ మత పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మతవిద్వేషాలు రెచ్చగొడితే సహించేది లేదని చంద్రబాబును హెచ్చరించారు. ఈ నేపథ్యంలో క్రైస్తవుల ఆగ్రహం చల్లార్చడానికి క్రైస్తవులను బుజ్జగించడానికి దివ్యవాణి రంగంలోకి దిగారు.
ఆలయాలపై దాడులు దుష్ప్రచారం చేస్తుంది వారే .. ఆ నేరాలకు పీడీ యాక్ట్ : డీజీపీ గౌతమ్ సవాంగ్
చంద్రబాబు వ్యాఖ్యలపై కలవరపడాల్సిన పని లేదన్న దివ్యవాణి
టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై క్రైస్తవులు కలవరపడవలసిన పనిలేదని దివ్యవాణి వ్యాఖ్యానించారు. ఏ మతాన్ని తక్కువగా చూడకూడదనే చంద్రబాబు చెప్పారని, చంద్రబాబు వ్యాఖ్యలను కొందరు కావాలనే వక్రీకరిస్తున్నారు అని దివ్యవాణి పేర్కొన్నారు. మతోన్మాదంతో పనిచేస్తున్న వారెవరో , మత సామరస్యం కోసం నిలిచే వారు ఎవరో ప్రజలు గ్రహించాల్సిన సమయం వచ్చిందని దివ్యవాణి పేర్కొన్నారు. క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ క్రైస్తవ మత ప్రబోధం చేస్తూ, క్రైస్తవులకు చేరువగా ఉండే దివ్యవాణి ద్వారా చంద్రబాబు క్రైస్తవులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సభలు ,సమావేశాలు , ఆందోళనలకు శ్రీకారం చుట్టిన క్రైస్తవ మత పెద్దలు
ఒకవైపు ఈరోజు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలోదళిత క్రైస్తవ ఆత్మగౌరవ సభ నిర్వహించి చంద్రబాబు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కార్యాచరణ రూపొందించాలని క్రైస్తవులు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఏపీ బిషప్ కౌన్సిల్ అండ్ పాస్టర్స్ ఫెలోషిప్ లీడర్స్ ఫోరం నాయకులు, మరియు క్రైస్తవులు చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడుతూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సభలు ,సమావేశాలు , ఆందోళనలకు శ్రీకారం చుట్టారు.
దిద్దుబాటు చర్యల్లో దివ్యవాణిని రంగంలోకి దించిన చంద్రబాబు
చంద్రబాబు వ్యాఖ్యలను నిరసిస్తూ టిడిపి క్రిస్టియన్ సెల్ లో పలువురు రాజీనామా చేయడంతో క్రిస్టియన్ల పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. హిందువులు ,ముస్లింలు, క్రైస్తవులు అన్నదమ్ముల్లా బ్రతుకుతూ ఉంటే మధ్యలో చంద్రబాబు క్రైస్తవుల మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడుతున్నారని క్రైస్తవ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో దివ్యవాణి చంద్రబాబు వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. దిద్దుబాటు చర్యలలో భాగంగా చంద్రబాబు దివ్యవాణిని రంగంలోకి దించి క్రిస్టియన్ లను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. మరి దివ్యవాణి ద్వారా చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం ఏ మేరకు సఫలం అవుతుందో వేచి చూడాలి .