చంద్రబాబు నేటి తెనాలి పర్యటన,బహిరంగ సభ వాయిదా ... రీజన్ ఇదే
రాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో ఇంకా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇటీవల తెనాలిలో దీక్షా శిబిరం వద్ద వైసీపీ , టీడీపీ , అమరావతి జేఏసీ నేతల ఘర్షణలో గాయపడ్డ వారిని చంద్రబాబు పరామర్శించి నేడు తెనాలిలో భారీ బహిరంగ సభ నిర్వహించాల్సి ఉంది . అయితే అది వాయిదా పడింది.

ప్రశాంతతను పాడుజేసే ఉద్దేశం లేకే చంద్రబాబు పర్యటన వాయిదా
ఇటీవల తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద రాజధాని అమరావతికి మద్దతుగా నిర్వహిస్తున్న దీక్షా శిబిరం వద్ద ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే .వైసీపీ నేతల దాడిని నిరసిస్తూ నేడు మధ్యాహ్నం టీడీపీ అధినేత చంద్రబాబు జేఏసీ నాయకులను పరామర్శించి మునిసిపల్ మార్కెట్ వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు బహిరంగ సభ నిర్వహించాల్సి ఉండగా 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రశాంతతను పాడుజేసే ఉద్దేశం లేకే పర్యటనను వాయిదా వేసినట్టు తెలుస్తుంది .

తెనాలి పట్టణంలో 144 సెక్షన్ అమలు కారణం
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి నేటి తెనాలి పర్యటన వాయిదా పడిన నేపధ్యంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ చంద్రబాబు పర్యటన వాయిదా గురించి మాట్లాడారు. తెనాలికిఉన్న ప్రశాంతతను నిలబెట్టడానికి రాజధాని అమరావతి పోరాటాన్ని ఉధృతం చేయడానికి బాబు పర్యటనకు ఏర్పాటు చేశామన్న ఆయన తెనాలి పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉన్న కారణంగానే వాయిదా వేసినట్టు తెలిపారు.

ఫిబ్రవరి తొలి వారంలో బాబు పర్యటన ఉంటుందన్న మాజీమంత్రి ఆలపాటి రాజా
వైసీపీతో అల్లర్ల కోసమో, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికో ఈ పర్యటన కాదన్న ఆయన మండలి రద్దు, మారుతున్న పరిణామాల నేపథ్యంలోనే చంద్రబాబు పర్యటనను వాయిదా వేశామని, ఫిబ్రవరి తొలి వారంలో బాబు పర్యటన ఉంటుందని తెలిపారు. అమరావతి సమస్య ఏ ఒక్కరిదో , ఒక్క పార్టీదో కాదని, ఇది అందరిదీ అని ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. అమరావతి ఉద్యమ తదుపరి కార్యాచరణ తెనాలి వేదికగా జరుగుతుందన్న ఆయన రాజధాని అమరావతి పరిరక్షణ కోసం అందరూ కలిసి పోరాటం సాగించాలని సూచించారు.












Click it and Unblock the Notifications