చంద్రబాబు ఆపకపోతే నా భార్య అరెస్టు - వైసీపీ మాజీ మంత్రి షాకింగ్ వ్యాఖలు వైరల్..!
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక తమను టార్గెట్ చేస్తున్నారని వైసీపీ నేతలు గగ్గోలు పెడుతూనే ఉన్నారు. అయితే తాజాగా రేషన్ బియ్యం స్కాం పేరుతో వైసీపీ నేతల్ని ప్రభుత్వం టార్గెట్ చేస్తుండటంతో వీరిలో కొందరు అజ్ఢాతంలోకి కూడా వెళ్లిపోతున్నారు. ఇదే క్రమంలో మచిలీపట్నంకు చెందిన వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం కూడా రేషన్ బియ్యం స్కాంలో ఉందంటూ ఆరోపణలు రావడంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి మరీ వీరి అరెస్టుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ఇవాళ మీడియా ముందుకు వచ్చారు. రేషన్ బియ్యం స్కాంలో తమ కుటుంబం తప్పేమీ లేదన్నారు. తమ గోడౌన్ లో పౌరసరఫరాల శాఖ దాచుకున్న రేషన్ బియ్యం అదృశ్యమైన వ్యవహారంలో టెక్నికల్ గా తమ తప్పేమీ లేకపోయినా నైతిక బాధ్యతగా అధికారులకు సహకరిస్తున్నట్లు పేర్ని చెప్పుకొచ్చారు. అయితే రేషన్ బియ్యం వ్యవహారంలో విచారణ పూర్తి కాకపోయినా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారని విమర్శించారు.

రేషన్ బియ్యం కుంభకోణంలో తన తప్పేమీ లేదని, తన తల్లి మీద ప్రమాణం చేసి చెబుతున్నానని పేర్ని నాని తెలిపారు. ఈ కేసులో తన భార్య జయసుధను అరెస్టు చేయించేందుకు మంత్రి కొల్లు రవీంద్ర ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాము ఎక్కడికీ పారిపోలేదన్నారు. తనపై ప్రతీకారం తీర్చుకోవాలని ఇంట్లో ఆడవాళ్లను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. గోడౌన్ మేనేజర్ ను అరెస్టు చేసి తన భార్య పేరు చెప్పించాలని ప్లాన్ చేశారన్నారు. రాజకీయ కక్ష ఉంటే తనపై తీర్చుకోకుండా ఇంట్లో ఆడవాళ్లతో ఏం పని అని పేర్ని ప్రశ్నించారు.
కొల్లు రవీంద్ర ఎన్నిసార్లు చంద్రబాబును కలిసి తన భార్య జయసుధను అరెస్టు చేద్దామని ఒత్తిడి తెచ్చినా ఆయన మాత్రం ఒప్పుకోలేదన్నారు. చంద్రబాబు మాత్రం మైండ్ చెడిందా, ఆడోళ్లను అరెస్టు చేయడమేంటి? అవసరమైతే పేర్ని నాని, ఆయన కొడుకుని అరెస్టు చేసుకోమన్నారన్నారు. చంద్రబాబుతో తమకు రాజకీయ వైరం ఉన్నా ఈ విషయంలో మాత్రం ఆయన హుందాగా ప్రవర్తించారన్నారు.












Click it and Unblock the Notifications