నాకే ఆఫీస్ లేదు, పంట రావాలంటే...: చంద్రబాబు
ఏలూరు: తనకే కార్యాలయం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఆయన బుధవారం ఆ విధంగా అన్నారు. పంట రావాలంటే ఆరు నెలలు పడుతుందని, తన పరిస్థితి కూడా అంతేనని ఆయన అన్నారు. హామీలను అమలు చేయడానికి ప్రయత్నిస్తానని ఆయన అన్నారు.
పశ్చిమగోదావరి, అనంతపురం జిల్లాల్లో 90 శాతం సబ్బిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని ఆయన ప్రకటించారు. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని ఆయన అన్నారు.

ఇంకా అనేక అభివృద్ధి పథకాలు తన మనసులో ఉన్నాయని ఆయన చెప్పారు. ద్వారకా తిరుమలను నగరంగా అభివృద్ధి చేస్తామని బాబు తెలిపారు. ఏపీలో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
నాలుగేళ్లలో పొలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవని, అభివృద్ధితో ఆదాయం పెంచుదామని ఆయన అన్నారు. బెల్టు షాపుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పశ్చిమగోదారి, అనంతపురం జిల్లాల రుణం తీర్చుకుంటామని ఆయన అన్నారు. వృద్ధులకు అక్టోబర్ 2 నుంచి రూ. వెయ్యి ఫించన్ అందజేస్తామని ఆయన ప్రకటించారు.












Click it and Unblock the Notifications