హోదాపై తప్పించకోను, సాక్షి చూస్తే మైండ్ ఖరాబు: చంద్రబాబు
అమరావతి: ప్రత్యేక హోదాతో సహా కేంద్రం నెరవేర్చవలసిన హామీలన్నిటిపై పట్టుబడతానని, రాజీపడేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడదు స్పష్టం చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా శుక్రవారమిక్కడ జరిగిన సభలో ఆయన మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రానికి కేంద్రం ఇప్పటి వరకు కొన్ని మాత్రమే చేసిందని, విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలనూ అమలు చేయాల్సి ఉందని, ఆనాటి ప్రధాని ఇచ్చిన హామీలనూ నెరవేర్చాలని, వాటికి తోడు మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో సమానంగా ఎదిగేవరకు చేయూతనివ్వాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు మాట్లాడుతోందని, హోదాపై కేంద్రం సహకరించలేదని తప్పించుకోనని ఆయన చెప్పారు. తన సుదీర్ఘ పాదయాత్ర తర్వాత పటిష్ఠంగా మారిన తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేకే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించిందని విమర్సించారు.
ఓవైపు టీఆర్ఎ్సతో విలీన ఒప్పందం చేసుకుని, మరోవైపు వైసీపీ అధ్యక్షుడిని జైలు నుంచి విడుదల చేయించి రెండు రాష్ట్రాల్లోనూ గెలవాలని కాంగ్రెస్ కలలు కన్నదని, అందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించి అన్యాయం చేసిందని ఆయన అన్నారు.
అవినీతి లేని రాజకీయం వచ్చేవరకు నిరంతరం పోరాడతానని, రాష్ట్రంలో అవినీతిపరుల పట్ల యముడిలా ప్రవర్తిస్తానని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అవినీతి లేకుండా చేస్తానన్నారు. వెయ్యి రూపాయల నోట్లను నిషేధించాలని ఇటీవల జరిగిన అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో కోరానని చెప్పారు.
తనకెప్పుడూ పత్రిక, టీవీ పెట్టాలన్న ఆలోచనే రాలేదని చంద్రబాబు అన్నారు. అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష నేత పత్రికను, టీవీని పెట్టుకున్నారని అన్నారు. వారు అధికారంలోకి వస్తే ఎలాంటి తప్పుడు పనులు చేయాలని కలలు కన్నారో... అలాంటి పనులు వారి మాదిరిగానే మనం చేస్తున్నామని రాస్తున్నారని, ఆ పేపర్ చూస్తే మైండ్ ఖరాబవుతుందని, అలాంటి అవినీతి పేపర్ను పట్టించుకోకపోతే మంచిదని అన్నారు.
కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది నేతల కోసం కాదని, ప్రజల కోసమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని చెప్పారు. బ్రిటిష్ హయాంలో కట్టిన ఆనకట్టల వల్ల గోదావరి జిల్లాలు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో నాగరికత పెరిగిందని, వ్యవసాయాదాయం పెరిగి చదువుకొని అభివృద్ధిలోకి వచ్చారని ఆయన గుర్తు చేశారు. తానిప్పుడు రాయలసీమలో అదే చేయబోతున్నానని చెప్పారు.
ఎప్పుడు కనిపించినా ఆప్యాయంగా గౌరవంగా పలకరించే చంద్రబాబును వదిలి వైసీపీలో చేరి తప్పు చేశానని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. 20 ఏళ్లు తెలుగుదేశం పార్టీలో ఉండి పార్టీ మారిన తాను తిరిగి టీడీపీలోకి వెళ్తానని జగన్మోహన్రెడ్డికి ఎప్పుడూ అనుమానం ఉండేదన్నారు.