తెలంగాణలో జగన్ దుకాణం బంద్, సమైక్యం: బాబు
చిత్తూరు: తెలంగాణలో తన దుకాణాన్ని మూసేసుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సమైక్యవాదాన్ని తీసుకున్నాడని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తనకు వచ్చే నాలుగైదు సీట్లను అమ్ముకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తన అధ్యక్షుడు జగన్కు బెయిల్ తెచ్చుకుందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్రకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.
పార్టీ చేపట్టిన ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు సోమవారం చిత్తూరు జిల్లా శాంతిపురంలో పర్యటించారు. కాంగ్రెసుతో లాలూచీ పడడం వల్లనే జగన్కు బెయిల్ వచ్చిందని ఆయన అన్నారు. జైలు నుంచి బయటపడేందుకు జగన్ కాంగ్రెసు అధిష్టానానికి తెలుగుజాతిని తాకట్టు పెట్టాడని ఆయన వ్యాఖ్యానించారు.

సమైక్యవాదం ముసుగులో జగన్ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ వాదాన్ని రాష్ట్రంలోకి తెస్తున్నాడని ఆయన అన్నారు. ఎన్నికల తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసులో విలీనమవుతుందని ఆయన జోస్యం చెప్పారు.
కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రంగులు మార్చడంలో ఊసరవెల్లిని మించిపోయారని తెలుగుదేశం పార్టీ శాసన మండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు సోమవారం హైదరాబాదులో ధ్వజమెత్తారు. ఆర్టికల్ 3 ద్వారా రాష్ట్రాన్ని విభజించవచ్చునని సూచించిన జగన్ ఇప్పుడు దానిని సవరించమని డిమాండ్ చేయడమేమిటని ప్రశ్నించారు.
జగన్ జైలు నుండి బయటకు వచ్చాక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రాబల్యం తగ్గిపోయిందని సర్వేల ద్వారా తేటతెల్లమవుతోందన్నారు. కాంగ్రెసు రాజకీయాల్లో, రాష్ట్ర విభజనలోను జగన్ భాగస్వామి అయ్యారని ఆరోపించారు. పర్యటనల సాకుతో కోర్టు వాయిదాలను తప్పించుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications