చాలా బాధేస్తోంది: అనురాధ హత్యపై చంద్రబాబు, కొడాలి నానిపై ఆగ్రహం
విజయవాడ: చిత్తూరు మేయర్ కటారి అనురాధ హత్యను చూస్తే బాధేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మహిళనలు ఎప్పుడైనా చంపిన దాఖలాలున్నాయా, ఎంత బాధాకరం, చాలా బాధేస్తోందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
మానవత్వం మరిచిపోయి మృగాల మాదిరిగా వ్యవహరించారని, కరుడుగట్టినవాళ్లకే ఇలాంటి మనస్తత్వం ఉంటుందని ఆయన అనురాధ హంతకులపై వ్యాఖ్యానించారు. అనురాధ హత్య కేసులో ఇద్దరు సరెండర్ అయ్యారని ఆయన చెప్పారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని ఆయన చెప్పారు. నీచమైన రాజకీయాలను ప్రోత్సహించేవారిని కఠినంగా శిక్షిస్తామని, రాజకీయం ముసుగులో హత్యలూ అరాచకాలూ చేస్తున్నారని ఆయన హెచ్చరించారు.
అనురాధ హత్య ఎలా జరిగిందనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. స్మగ్లర్లు, రాజకీయ ముసుగులో నేరాలు చేసేవారు చాలా ప్రమాదకరంగా పరిణమించారని ఆయన అన్నారు. రాజకీయాలు చేసేవారు దారుణాలు చేయడమే కాకుండా సవాళ్లు విసురుతున్నారని ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని ఉదంతంపై పరోక్షంగా అన్నారు. లూటీలు, హత్యలు, నేరాలు పదేళ్ల పాటు వారసత్వంగా సాగాయని ఆయన అన్నారు.
అటువంటివారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, అలాంటి వాళ్లు భయపడే విధంగా చర్యలు ఉంటాయని ఆయన అన్నారు. అనురాధ హత్య కేసులో ఎవరూ తప్పించుకోవడానికి వీలులేదని ఆయన అన్నారు. అందులో రాజీ లేదని అన్నారు. నిర్మొహమాటంగా, కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. కొడాలి నాని ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ఓ ముసలావిడ ఇల్లు అని, దాన్ని ఖాళీ చేయాలని అడిగితే చేయాలి గానీ దాన్ని రాజకీయం చేయడమేమిటని అన్నారు.
నీచ రాజకీయాలు చేసేవారిని ఉపేక్షించేది లేదని అన్నారు. రాజకీయాల్లో ఉన్నవారిని చూసి ప్రజలు భయపడేందుకు లైసెన్స్ కావాలంటున్నారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించాలని అంటున్నారని, సామాన్యులు అభద్రతా భావం పెరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అందుకే కఠినంగా వ్యవహరిస్తామని చంద్రబాబు అన్నారు.
ప్యారిస్లో ఏమైంది, సమస్యను సృష్టించడానికీ భయబ్రాంతులను చేయడానికి ఐదారుగురు చాలునని, అటువంటి వారి ఆట కట్టించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అలా చేయకపోతే ఎవరికి భద్రత ఉంటుందని ఆయన అడిగారు. ప్రభుత్వం కఠినంగా లేకపోతే, సవాళ్లు విసురుతున్నవారిని సహిస్తే ప్రజలు అభద్రతాభావనకు గురవుతారని, అభద్రతతో బతకడం నాగరిక ప్రపంచంలో దుర్మార్గమని ఆయన అన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, అయితే శాంతిభద్రతల పరిరక్షణలో కఠినంగా, నిర్మొహమాటంగా వ్యవహరిస్తామని ఆయన చెప్పారు.