మోడీపై టీడీపీ నాయకుల ఫ్లెక్సీలు, చంద్రబాబు ఆగ్రహం.. ఎమ్మెల్యే గణేష్కు క్లాస్!
అమరావతి: ఏపీలో టీడీపీ, బీజేపీల మధ్య వివాదం ముదిరిన సంగతి తెలిసిందే. ఏపీ ఇచ్చిన హామీలను ప్రధాని మోడీ నెరవేర్చడం లేదంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా టీడీపీ నేత కాట్రగడ్డ బాబు విజయవాడలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు బీజేపీ నేతలకు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి.
దీనిపై బీజేపీ నేతలు సోము వీర్రాజు, విష్ణుకుమార్ రాజు, మాధవ్ లు తమ అసహనాన్ని బహిరంగంగానే వ్యక్తపరిచారు. బీజేపీని, ప్రధాని మోడీని కించపరిచే చర్యలను టీడీపీ నేతలు మానుకోవాలని వారు హితవు పలికారు. ఈ నేపథ్యంలో స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కాట్రగడ్డ బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని తన పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు.
కించపరిచే రీతిలో ఎవరి గురించీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయవద్దని సీఎం చంద్రబాబు తన పార్టీ నాయకులకు సూచించారు. దీంతో ఆ పార్టీ నాయకులు సదరు ఫ్లెక్సీలను వెంటనే తొలగించారు. మరోవైపు ప్రధాని మోడీకి వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ చేపట్టిన నిరసన కార్యక్రమం కూడా టీడీపీ, బీజేపీ నేతల మధ్య అగ్గి రాజేసింది. రైల్వే జోన్ ను డిమాండ్ చేస్తూ ఆయన చేపట్టిన నిరసన కార్యక్రమంలో... మోడీ వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి మెడలు వంచుతున్నట్టు ప్రదర్శించారు.
దీంతో, బీజేపీ నేతలు గణేష్పైనా ఫైర్ అయ్యారు. దీనికి గణేష్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గణేష్కు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. నిరసన కార్యక్రమాలు హుందాగా ఉండాలని, ఎదుటివారిని కించపరిచే విధంగా ఉండరాదని ఆయన గణేష్కు సూచించినట్లు తెలుస్తోంది.