ఈ చిన్నారి నేరస్తుడా? - స్త్రీ,పురుషులు ఒకే గదిలోనా? - శారదా పీఠానికి టీటీడీ నిధులా?: చంద్రబాబు ఫైర్
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ సొంత చట్టాలను అమలు చేస్తున్నదని, ప్రతి విషయంలో అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నదని, ప్రశ్నించినవాళ్లపై ఎదురుదాడులు చేస్తూ.. అక్రమ కేసులు బనాయిస్తున్నదని టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆలయాలపై దాడుల్ని అరికట్టడంలో ఫెయిలైన జగన్ సర్కారు.. చివరికి ఏడేళ్ల చిన్నారిని పోలీస్ స్టేషన్ లో ఉంచడం దారుణమని మండిపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయయ.. ఆలయాల అంశంపై అనూహ్య వ్యాఖ్యలు చేశారు. చిన్నారి ఘటనపై ట్విటర్ లో స్పందించారు.

చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో..
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామానికి చెందిన భూక్యా కుటుంబీకులపై వైసీపీకి చెందిన ఓ నేత ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిబంధనలు పాటించకుండా చర్యలకు ఉపక్రమించారని, ఆ కుటుంబంలోని ఏడేళ్ల చిన్నారిని సైతం చిల్లకల్లు స్టేషన్ లో నిర్భందించారని చంద్రబాబు ఆరోపించారు. కొంతమంది పోలీసులు.. అసలైన చట్టాలను వదిలేసి.. వైసీపీ నేతలు చెప్పిందే చట్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చిల్లకల్లు పోలీస్ స్టేషన్ లో ఏడేళ్ల చిన్నారి సహా భూక్యా కుటుంబీకుల్ని ఒకే దగ్గర కూర్చోబెట్టిన ఫొటోలను చంద్రబాబు షేర్ చేశారు.

మీ తీరు మారదా?
ఒకే గదిలో గదిలో ఓ చిన్నారి కూడా ఉండడం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు.. ‘‘ఆ చిన్నారిలో మీకు ఏ నేరస్థుడు కనిపించాడు. స్త్రీ పురుషులను ఒకే గదిలో నిర్బంధించమని ఏ చట్టంలో ఉంది? తెలుగుదేశం పార్టీ వాళ్ళను కోవిడ్ నిబంధనలంటూ ఇబ్బంది పెట్టే మీకు, ఇలా అందరినీ గుంపుగా ఒక్కచోట నిర్బంధించడానికి ఏ వైసీపీ చట్టం అనుమతించింది? కోర్టులు వేలెత్తి చూపినా మీ తీరు మారదా?'' అని పోలీసులను ఉద్దేశించి టీడీపీ చీఫ్ మండిపడ్డారు. అంతకుముందు ప్రెస్ మీట్ లో ఆలయాల్లో చోటుచేసుకున్న ఘటనలపైనా సర్కారుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆలయాల ధ్వంసంపై టీడీపీ పోరుబాట..
రాష్ట్రంలో ఎప్పుడూలేని వింత పోకడలు చూస్తున్నామని, పలు చోట్ల ఆలయాలను టార్గెట్ చేసుకుని విధ్వంస కార్యక్రమాలు జరుగుతున్నాయని, చట్టాన్ని కాపాడాల్సిన వాళ్లు సమర్థవంతంగా వ్యవహరించని కారణంగా భక్తులు జైళ్లలో, అసలు నిందితులు బయట ఉన్నారని చంద్రబాబు ఆరోపించారు. అరాచక శక్తులపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని సూచించిన ఆయన.. అంతర్వేదితోపాటు అన్ని ఆలయాల్లో చోటుచేసుకున్న ఘటనలపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. వైసీపీ తప్పుడు విధానాలపై ప్రజల్లోకి వెళతామని, ఆలయాల ధ్వంసంపై ఏడురోజుల పాటు నిరసనలు తెలుపుతామని చంద్రబాబు అన్నారు.

వినాయకుడికి లేదు.. వైఎస్సార్ జయంతికా?
జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 11 ఆలయాలపై దాడులు జరిగాయని, ఇవాళ హిందూ ఆలయాలు, రేపు చర్చిలు, మసీదులపై దాడులు జరిగే అవకాశముందని, ఈ ఘటనలకు ఎవరు బాధ్యత వహిస్తారో ప్రభుత్వమే చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు. ఆలయాల ఘటనలపై ప్రభుత్వం మొదటి నుంచీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, దుర్గగుడికి కూతవేటు దూరంలో ఉండే మంత్రి వెల్లంపల్లి కూడా లెక్కలేనితనంతో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘వినాయకచవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వలేదు కానీ.. వైఎస్సార్ జన్మదిన వేడుకలకు మాత్రం అప్పటికప్పుడు అనుమతులిస్తూ జీవోలు జారీ చేయడం జగన్ సర్కారుకే చెల్లింది''అని విమర్శించారు.

శారద పీఠానికి శ్రీవారి నిధులా?
టీటీడీ ఆస్తుల అమ్మకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో జగన్ సర్కారు వెనక్కి తగ్గిందని, అయితే ఆలయ భూములు, నిధుల పరిరక్షణలో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని చంద్రబాబు ఆరోపించారు. ‘‘టీటీడీలో సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ నేతల కోసం ఎదురు చూస్తూ స్వామివారి సేవలను ఆలస్యం చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో ఎస్వీబీసీ చానెల్ చైర్మన్ రాజీనామా చేశారు. విశాఖ శారదాపీఠం కార్యక్రమాలకు శ్రీవారి సొమ్ములను ఖర్చు చేస్తున్నారు. చాలా ఆలయాల్లో సీసీటీవీ కెమెరాలను తీసేశారు. తప్పుడు పనులు చేయడానికే ఆ పని చేశారు'' అని చంద్రబాబు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications