ఇచ్చేది గోరంత దోచుకునేది కొండంత; జూనియర్ కిమ్ మాదిరిగా జగన్ తీరు ఉందన్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసిపి సర్కారు తీరుపై, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓటిఎస్ వసూళ్ల పేరుతో పేదల మెడకు ఉరి తాడు బిగిస్తున్నారు అంటూ చంద్రబాబు ఆరోపించారు.

జగన్ వల్ల పుట్టే ప్రతి బిడ్డపైనా అప్పుల భారం
జగనన్న సంపూర్ణ గృహ పథకం అంటూ జగన్మోహన్ రెడ్డి నిరుపేద ప్రజలను మోసం చేస్తున్నారని, మోసపూరిత ప్రకటనలతో జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ధరల నియంత్రణలో జగన్ సర్కార్ విఫలమైందని పేర్కొన్న చంద్రబాబు, నిత్యావసర వస్తువుల ధరలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆకాశాన్ని తాకుతున్నాయి అని అన్నారు. జూనియర్ కిమ్ మాదిరిగా జగన్ వ్యవహరిస్తున్నారని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ రెడ్డి అప్పులలో ముంచేస్తున్నారని మండిపడ్డారు. పుట్టే ప్రతి బిడ్డ పైన కూడా అప్పు భారం పడుతుందని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఉపాది హామీ నిధులు, పంచాయతీ నిధులు పక్కదారి
ఉపాధి హామీ నిధులను పక్కదారి పట్టించడంతో పాటుగా, కేంద్రం అందిస్తున్న పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఇక పంచాయతీ నిధులను ఇప్పటికే దారి మళ్లించారని, ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వ భూములను అమ్ముతున్నారని, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వాన్ని కేంద్రం నమ్మే పరిస్థితి లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల అమ్మకం డిజిన్వెస్ట్మెంట్ విధానంలో భాగం కాదని , బిల్డ్ ఏపీ కేసులో ఇంప్లీడ్ కాలేమని కేంద్రం తేల్చి చెప్పడం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి చెంపపెట్టు అన్నారు చంద్రబాబు.

రాష్ట్రంలో ప్రశ్నించిన వారిపై కేసులు , దాడులు
రాష్ట్రంలో రైతన్న పరిస్థితి దారుణంగా ఉందని, సంక్రాంతి పండగను రైతులు ఆనందంగా జరుపుకోలేని పరిస్థితి వచ్చిందని, రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలను కూడా జగన్ తరలిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నది పేటీఎం బ్యాచ్ లకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు చంద్రబాబు. ఇక ఇదే సమయంలో సుబ్బారావు గుప్తా ఇంటిపై దాడికి పాల్పడడం గర్హనీయమని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడటం నిత్యకృత్యంగా మారిందని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతుందని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి వల్ల ఏపీ ఉద్యోగులు రోడ్ల మీదకు వచ్చారని చంద్రబాబు విమర్శించారు.

పశువులకు గడ్డి పెట్టలేని వ్యక్తి మూడు రాజధానులు కడతారా?
విశాఖ రామానంద ఆశ్రమంలో గోవులు చనిపోతున్నా పట్టించుకోవడంలేదని, పశువులకు గడ్డి పెట్టలేని వ్యక్తి మూడు రాజధానులు కడతారా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. సీఎం జగన్ సొంత బాబాయి వివేకానంద రెడ్డి హత్య కేసును కుట్రలతో దారి మళ్లిస్తున్నారు అంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక ఏపీ ఆర్టీసీ భవిష్య నిధి 1,600 కోట్ల రూపాయలను కూడా దారి మళ్ళించడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని చంద్రబాబు మండిపడ్డారు.

జగన్ వద్ద బస్సు గేర్ బాక్స్ మార్చటానికి కూడా డబ్బులు లేవు, దానివల్లే వాగులో బస్సు బోల్తా
ఇక ఇటీవల జరిగిన జల్లేరు వాగులో బస్సు బోల్తా ఘటనకు సంబంధించి జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు. బస్సు బోల్తా ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చంద్రబాబు పేర్కొన్నారు. కనీసం బస్సు లో గేర్ బాక్స్ మార్చడానికి కూడా జగన్ వద్ద డబ్బులు లేవని రాష్ట్రాన్ని అంత అధోగతికి జగన్ తీసుకువెళ్లారని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.సంక్షేమం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, ఇచ్చేది గోరంత దోచుకునేది కొండంత అంటూ చంద్రబాబు విమర్శించారు.












Click it and Unblock the Notifications