ఫోన్ ట్యాపింగ్: కెసిఆర్ ప్రభుత్వంపై చంద్రబాబు ఇక దూకుడే
హైదరాబాద్: తమ ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేసిన ఉదంతంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూకుడు ప్రదర్శిస్తున్నారు. తమ ఫోన్లను ట్యాప్ చేయడానికి బాధ్యులైన తెలంగాణ అధికారుల పేర్లతో తయారు చేసిన నివేదికను పది రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి సమర్పించినట్లు తెలుస్తోంది.
ఇద్దరు ఐఎఎస్, ఇద్దరు ఐపిఎస్ అధికారులు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్లు లభించిన ఆధారాలను ఎపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. సర్వీస్ ప్రొవైడర్లకు వారు ఇచ్చిన అథరైజేషన్ లేఖలను కూడా దానికి జత చేసినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, టిడిపి కార్యాలయం ఇంచార్జీ జనార్దన్, టిడిపి పార్లమెంటు సభ్యులు గరికపాటి రామమోహన్ రావు, సిఎం రమేష్, మరో ఏడుగురు తెలుగుదేశం శాసనసభ్యుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఎపి ప్రభుత్వం ఆధారాలు సంపాదించినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి ఫోన్ను కూడా ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది.
మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వివరమైన నివేదికను రూపొందించాలని చంద్రబాబు నాయుడు రాష్ట్ర నిఘా విభాగం అధిపతిని ఆదేశించినట్లు సమాచారం. ఇంతకు ముందు పంపిన నివేదికను మరింతగా విస్తృతపరుస్తూ ఈ నివేదిక రూపుదిద్దుకుంటుంది.
ఆ తర్వాత టిడిపికి చెందిన కేంద్ర మంత్రులు పి. అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి కేంద్ర హోం మంత్రిని కలిసి ఆయనకు ఆ నివేదికను సమర్పిస్తారు. తెలంగాణ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్లు చంద్రబాబు ఆరోపిస్తున్నారు.
ఇటీవల విజయవాడలో ఉన్నతాధికారుల సమావేశంలో చంద్రబాబు ఆ విషయం ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందని, దీని నుంచి తెలంగాణ ప్రభుత్వం తప్పించుకోలేదని ఆయన సమావేశంలో అన్నట్లు తెలుస్తోంది.