కాపు రిజర్వేషన్లు: దిగిరాని చంద్రబాబు, నివేదిక వచ్చాకే...
విజయవాడ: కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో మెట్టు దిగిరావడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధంగా లేనట్లు కనిపిస్తున్నారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని చెబుతూనే జస్టిస్ మంజునాథ్ కమిషన్ నివేదిక వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని కాపు నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.
కాపులకు రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయం జరగకుండా చూస్తామని స్పష్టంచేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కాపు కార్పొరేషన్ నిధులు పెంచుతామని హామీ ఇచ్చారు. తుని తరహా ఘటనలు పునరావృతమైతే తనకున్న సౌలభ్యం తగ్గిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. పూర్తి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం తనకు ఇవ్వాలని కాపు సంఘాల నాయకులను సీఎం కోరారు.
మంగళవారం సాయంత్రం చంద్రబాబు రాష్ట్రంలోని కాపు నాయకులతో సమావేశమయ్యారు. సమావేశానికి ముందు కాపు నాయకులతో మంత్రులు నారాయణ, చిన రాజప్ప, గంటా శ్రీనివాసరావు, టిడిపి ఎపి అధ్యక్షుడు కళా వెంకట్రావు చర్చించారు. మంజునాథ్ కమిషన్ గడువును 9 నెలలకు బదులు 3 నుంచి 5 నెలలకు కుదించాలని కాపు నాయకులు కోరారు. అలాగే, కాపు కార్పోరేషన్కు కనీసం వేయి కోట్ల రూపాయలు విడుదల చేయాలని సూచించారు.
అయితే, కాపు నాయకుల వినతులకు చంద్రబాబు అనుకూలంగా ప్రతిస్పందించినట్లు లేదు. తనకు సహకరించాలని మాత్రమే సూచించారు. కాపుల రిజర్వేషన్లపై అందరినీ ఒప్పించాల్సి ఉందని చెప్పారు. కాపు సంఘాలకు చెందిన సుమారు 250 మంది ప్రతినిధులు విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశాలకు హాజరయ్యారు.
కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు పిళ్ళా వెంకటేశ్వరరావు, ఇతర కాపు సంఘాల సీనియర్ నేతలు నారాయణస్వామి, తాడివాక రమేశ్ నాయుడు, వేల్పూరి శ్రీనివాస్ తదితరులు ఈ సమావేశానికి వచ్చారు. కాపు సంఘాల నాయకులతో తొలుత మంత్రుల బృందం సమావేశం నిర్వహించింది.
ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు గంటా శ్రీనివాసరావు, పి.నారాయణ, ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎంపీ అవంతి శ్రీనివాస్, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజం, కాపు సామాజికవర్గానికి చెందిన ఇతర ఎమ్మెల్యేలు వారితో చర్చలు జరిపారు.