ఫలించిన చంద్రబాబు వ్యూహం: విపక్షాలకు తిరుగులేని కౌంటర్
హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై పోరుకు దిగిన ప్రతిపక్షాలను దెబ్బ తీయడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫలితం సాధించినట్లే కనిపిస్తున్నారు. ఈ విషయంలో ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇటీవల విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు సుదీర్ఘంగా మాట్లాడడంతో దాదాపు సందేహాలు నివృత్తి కావడం మాట అటుంచి, వేచి చూడాల్సిన పరిస్థితిలో ప్రతిపక్షాలు పడ్డాయి.
ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబును చిక్కుల్లో పడేయడానికి ముప్పేట దాడి ప్రారంభమైంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, కాంగ్రెసు, సిపిఐ ఆందోళనలకు శ్రీకారం చుట్టాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. చంద్రబాబుపై అన్ని వైపుల నుంచి ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తూ వచ్చారు. జగన్ ఏకంగా ఢిల్లీలో ధర్నా చేయగా, కాంగ్రెసు తిరుపతిలో సభ నిర్వహించింది. సిపిఐ బంద్ కూడా నిర్వహించింది. ఈ బంద్కు కాంగ్రెసు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు మద్దతు తెలిపాయి.
ఆందోళనలు ఉధృతం కావడానికి రంగం సిద్ధమైన స్థితిలో చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆగస్టు 15వ తేదీ తర్వాత విభజన సమస్యలపై, ప్రత్యేక హోదాపై, ప్యాకేజీపై మాట్లాడుదామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని చంద్రబాబు చెప్పారు. దీంతో మోడీ, చంద్రబాబుల భేటీ ముగిసే వరకు ఆగాల్సిన పరిస్థితిలో ప్రతిపక్షాలు పడ్డాయి.

మరో విధంగా కూడా చంద్రబాబు వ్యూహాత్మకంగానే వ్యవహరించారు. బిజెపి మిత్రపక్షమైనప్పటికీ తాను రాజీ పడడం లేదనే పద్ధతిలో ఆయన మీడియా సమావేశం యావత్తూ జరిగింది. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత ప్రధానిదేనని, విభజన సమస్యలను పరిష్కరించి ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి అవసరమైన సాయమంతా కేంద్రం చేయాల్సిందేనని ఆయన స్పష్టంగా చెప్పారు.
అటు బిజెపిపై ఒత్తిడి పెడుతున్నట్లు కనిపిస్తూనే ప్రతిపక్షాలు మాట్లాడలేని పరిస్థితిని చంద్రబాబు కల్పించారు. చంద్రబాబు మీడియా సమావేశం తర్వాత ప్రతిపక్షాలు చల్లబడ్డాయి. తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్న తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులకు, కేంద్ర మంత్రులకు ఊరట లభించింది.
దాదాపుగా ప్రత్యేక హోదా సాధ్యం కాదనే విషయం తెలిసిపోయింది. అందుకే, చంద్రబాబు ఒక్క ప్రత్యేక హోదాతో సమస్యలు పరిష్కారం కావని అన్నారు. ప్రత్యేక హోదా వల్ల ఒనగూరే ప్రయోజనాల కన్నా ఎక్కువ ప్రయోజనాలు పొందే విధంగా ప్రత్యేక ప్యాకేజీని పొందాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారు. కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన తర్వాత అది ప్రత్యేక హోదా వల్ల చేకూరే ప్రయోజనాల కన్నా ఏ విధంగా ఎక్కువ ప్రయోజనాలను నెరవేరుస్తుందో చెప్పాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications