చంద్రబాబు వ్యూహమా?: ప్రతిసారీ ఇలాగే, పవన్ కల్యాణ్తో జగన్ కార్నర్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్యలు తలెత్తిన ప్రతిసారీ మూడు ముక్కలాట రక్తి కట్టిస్తున్నట్లు అనిపిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వ పథకాలపై ఎప్పటికప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గళమెత్తుతున్నారు. జగన్ అలా విమర్శల జడివానలు కురిపిస్తున్న తరుణంలో జనసేన పవన్ కల్యాణ్ రంగంలోకి దిగుతున్నారు.
ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా మెగాఫుడ్ పార్కు ప్రాజెక్టు విషయంలో అలాగే జరిగింది. జగన్కు కళ్లెం వేయడానికే అన్నట్లుగా పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు. ఇది చంద్రబాబు వ్యూహమా లేదా జగన్ను తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా భావించి పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారా అనేది స్పష్టం కావడం లేదు
మెగాఫుడ్ పార్కు బాధితులకు జగన్ అండగా నిలిచారు. ఆ విషయంలో ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కానీ ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన కూడా రాలేదు. అకస్మాత్తుగా బాధితులు పవన్ కల్యాణ్ను అశ్రయించారు. ప్రభుత్వం తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ ధ్వజమెత్తిన 24 గంటల్లో ప్రభుత్వం స్పందించింది. మంత్రులు మెగాఫుడ్ పార్కును సందర్శించి, పరిష్కారం కోసం రైతులతో మాట్లాడారు.
మెగాఫుడ్ పార్కుపై పవన్ కల్యాణ్
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని తుందుర్రు గ్రామంలో మెగా ఫుడ్ పార్కు బాధితులతో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ప్రభుత్వ తీరుపై తీవ్రంగా విరుచుకుపడినట్లే కనిపించారు. కానీ, విషయం చంద్రబాబుకు తెలిసి ఉండకపోవచ్చునని కొద్దిగా ట్విస్ట్ ఇచ్చారు. చంద్రబాబుకు తెలిసి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదనే అభిప్రాయం వచ్చేలా ఆయన మాట్లాడారు.
అమరావతి విషయంలో కూడా...
ఇటీవలి భీమవరం సంఘటన మాదిరిగానే అమరావతి భూముల వ్యవహారం కూడా నడిచింది. భూసేకరణ సందర్భంగా ప్రభుత్వానికి కొన్ని గ్రామాల ప్రజలు ఎదురు తిరిగారు. వారికి జగన్ అండగా నిలిచారు. దాంతో తెలుగుదేశం పార్టీ జగన్పై దుమ్మెత్తిపోసింది. అభివృద్ధికి అడ్డం పడుతున్నారని విమర్శించింది.
పవన్ కల్యాణ్ను ఆశ్రయించారు
రాజధాని ప్రాంత రైతులు ఆ తర్వాత పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లారు. తమ గోడును విన్నవించుకోవడంతో పవన్ కల్యాణ్ రాజధాని ప్రాంత గ్రామాలను సందర్శించారు. రైతులకు ఇష్టం లేకుండా భూసేకరణ చేయడం సరికాదని పవన్ కల్యాణ్ చెప్పారు. దాంతో ప్రభుత్వం స్పందించి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేసింది.
ప్రత్యేక హోదాపై సైతం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలోనూ జగన్ పవన్ కల్యాణ్ నుంచి అదే విధమైన పరిస్థితిని ఎదుర్కున్నారు. ప్రత్యేక హోదాపై జగన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ విద్యార్థులను చైతన్యపరిచే కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవడానికి భయపడుతున్నారని విమర్శించారు. జగన్పై తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
హోదాపై పవన్ కల్యాణ్ ఇలా...
ప్రత్యేక హోదాపై తిరుపతిలో సభ పెట్టి పవన్ కల్యాణ్ తీవ్రంగానే మాట్లాడారు. ఆ తర్వాత కాకినాడలోనూ సభ పెట్టారు. ఈ రెండు సభల్లోనూ ఆయన బిజెపిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై కాస్తా సున్నితంగా విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష, అధికార పక్ష పార్లమెంటు సభ్యులపై మండిపడ్డారు.
చంద్రబాబుకు పవన్ కల్యాణ్తో ఊరట.
.
ప్రతి సమస్యపైనా జగన్ ఆందోళనలకు దిగి, తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో పవన్ కల్యాణ్ రంగంలోకి దిగడం పల్ల సమస్య సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ విమర్శలకు ప్రతిస్పందిస్తున్నట్లుగా ప్రభుత్వం ముందుకు కదులుతోంది. తద్వారా సమస్య పరిష్కారమైనట్లు కనిపిస్తోంది. ఇది చంద్రబాబు రాజకీయంగా ఊరటనిస్తోంది.