ఉచిత బస్సు ఎక్కే మహిళలకు చంద్రబాబు కీలక సూచన..!
ఏపీలో కూటమి సర్కార్ సూపర్ సిక్స్ ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి అమలు చేస్తోంది. ఈ పథకం ప్రారంభించిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు చేసే మహిళల సంఖ్య ఎప్పటికప్పుడు పెరిగిపోతోంది. దీంతో ఈ రద్దీని తట్టుకునేందుకు కొత్త బస్సులు వేయాల్సిన పరిస్ధితి కూడా వస్తోంది. దీంతో ప్రభుత్వం కూడా రద్దీ మేరకు కొత్త బస్సులు అందుబాటులోకి తెస్తామని చెబుతోంది.
ఉచిత బస్సు పథకంతో ఏపీలోని ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణాలు గతంతో పోలిస్తే రెట్టింపయ్యాయి. ఈ నేపథ్యంలో ఇవాళ విజయనగరం జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు ఉచిత బస్సు పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఈ పథకాన్ని వాడుకుంటున్న మహిళలకు ఆయన పలు సూచనలు చేశారు. ఒకప్పుడు రోజుకు 10లక్షల మందే బస్సులు ఎక్కుతున్నారని, కానీ ఇప్పుడు 20 లక్షల మంది బస్సుల్లో ప్రయాణాలు చేస్తున్నారన్నారు. అంటే సంఖ్య డబుల్ అయిందన్నారు.

ఉచిత బస్సు అవసరమా అని తనను కొందరు అడిగారని, కానీ తాను అవసరమే అని భావించి ఈ పథకాన్ని ప్రారంభించి విజయవంతంగా అమలు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ దసరాకు విజయవాడకు మహిళలు భారీ సంఖ్యలో ఉచిత బస్సుల్లో వచ్చి దర్శనాలు చేసుకున్నారని వెల్లడించారు. తాను దుర్గమ్మ దర్శనం కోసం వచ్చిన మహిళల్ని క్యూలో చూసినట్లు చంద్రబాబు తెలిపారు. దీంతో తనకు సంతోషం వేసిందన్నారు.

ఉచిత బస్సు సూపర్ హిట్ అయిందని, అదే సమయంలో అనవసరంగా తిరిగితే మాత్రం మీ ఆరోగ్యం పోతుందని మహిళలను ఉద్దేశించి చంద్రబాబు తెలిపారు. అవసరానికి ఈ పథకాన్ని వాడుకోవాలని, ఎక్కడైనా దేవాలయానికి వెళ్లాలంటే వెళ్లాలని, ఇందులో తప్పులేదన్నారు. దేవుడిని దర్శించుకుని ప్రార్థించుకుంటే మీ కోరికలు నెరవేరుతాయన్నారు. పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, ఇంకేమైనా కోరికలు ఉంటే తీరుతాయన్నారు. కానీ అనవసరంగా మాత్రం తిరగొద్దని చంద్రబాబు మహిళలకు సూచించారు.












Click it and Unblock the Notifications