బిజెపితో పెట్టుకోవద్దు: నేతలకు బాబు సూచన, సాక్షిపై గాలి ఫైర్
విజయవాడ: ప్రభుత్వంపై పదేపదే బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకుని వెళ్లారు. బీజేపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తామని నేతలు కోరారు. అయితే వారిని వద్దని బాబు వారించినట్లు సమాచారం. మిత్రధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత ఇరు పార్టీలపై ఉంటుందని నేతలకు చంద్రబాబు సూచించారు.
ఇదిలావుంటే, సీనియర్ నేత హరిరామజోగయ్య జీవితచరిత్రలో చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమ నాయుడు చెప్పారు. జోగయ్య చేసిన సత్యదూర వ్యాఖ్యలను అడ్డం పెట్టుకుని సాక్షి మీడియా నానాయాగీ చేస్తోందని ఆయన విమర్శించారు. ఆ వ్యాఖ్యలపై సీఎం స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు. పుస్తకావిష్కరణలో పాల్గొన్న నాయకులకు వివాదాస్పద వ్యాఖ్యల గురించి తెలియదని ముద్దుకృష్ణమ నాయుడు తెలిపారు.
అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం
కాగా, అమరావతి నిర్మాణం పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శైలజానాథ్ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల భూములను కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతోందని మండిపడ్డారు.
తాము చేసిన ఆరోపణలు వాస్తవం కాకపోతే సింగపూర్, మలేషియాతో ఒప్పందాలు బయటపెట్టాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రాణవాయువు ప్రత్యేకహోదా అని ఆయన అన్నారు. అది సాధించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాపై కేంద్రంపై టీడీపీ ఒత్తిడి తేవాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.