వంటల పోటీలు పెట్టండి: అధికారులకు చంద్రబాబు ఆదేశం
కర్నూలు: సంక్రాంతి పర్వదినం సందర్భంగా వంటల పోటీలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. గురువారం ఉదయం కర్నూలు నుంచి ఆయన అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
గ్రామాలను దత్తత తీసుకున్నవారిని సన్మానించాలని ఆయన ఆదేశించారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా వివిధ పోటీలను కూడా నిర్వహించాలని ఆయన సూచించారు. సంక్రాంతి పండుగను ఇంటింటా ఉత్సవంలా జరుపుకోవాలని ఆయన కోరారు.
కర్నూలు జిల్లా పర్యటన అనుభవాలను సీఎం అధికారులకు వివరించారు. ప్రజల్లో ఉత్సహం చాలా బాగా ఉందని, ఉత్తమ పద్దతులు ఎక్కడ ఉన్నా, వాటిని పాటించాలని అధికారులకు సూచించారు. అన్ని ప్రాంతాల్లో 5 కే, 10 కే రన్ లు నిర్వహించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత ఆయన తిరుపతి చేరుకుని ఎస్పి జెఎన్ఎం ఉన్నత పాఠశాలలో నిర్వహించే జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో ప్రభుత్వ అధికారులతో తిరుపతి స్మార్ట్ సిటీపై సమావేశం నిర్వహిస్తారు. అనంతరం సెవెన్ హిల్స్ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. తిరిగి సాయంత్రం ఐదు గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుంటారు.