కులం పేరుతో పవన్ ను తిడుతున్నారు - చెప్పు చూపించండి : చంద్రబాబు సంచలనం..!!
టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. కులాల కుంపట్లతో రాష్ట్రం నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల రౌడీయిజం పరాకాష్టకు చేరిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆ పార్టీ నేతల అరాచకాలు తట్టుకోలేకనే టీడీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కాపాడేందుకు తన వంతు కర్తవ్యం నిర్వర్తిస్తానని చంద్రబాబు స్పష్టం చేసారు. నేతల పనితీరును దృష్టిలో పెట్టుకునే వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు జరుగుతుందని పార్టీ నేతలకు చంద్రబాబు తేల్చిచెప్పారు.

కాపులను సరే..రెడ్లను తిడతారా
పార్టీలో సీనియారిటీ, సమీకరణాల పేర్లతో టిక్కెట్లు వస్తాయనుకోవద్దని నియోజకవర్గ ఇన్ఛార్జ్లకు తేల్చి చెప్పారు. నేతల పనితీరుపై ప్రతి మూడు నెలలకొసారి సమీక్ష చేపట్టనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జ్లతో సమీక్షలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. కులం పేరుతో పవన్ కళ్యాణ్ ను.. జనసేనను తిడుతున్నారంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ విధానాలను ప్రశ్నిస్తున్నారని కాపులను తిడుతున్నారని.. మరి రేపు రెడ్లు ప్రశ్నిస్తే వారినీ తిడతారా అని ప్రశ్నించారు. కులం పేరు ఎత్తిన వారికి.. చెప్పు తీసి చూపాలని చంద్రబాబు సూచించారు.
పార్టీ టిక్కెట్లు దక్కాలంటే
కుల మతాలకు అతీతంగా రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు అంతా ఒక్కటైతేనే బిడ్డలకు భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. విదేశీ విద్యకు అంబేడ్కర్ పేరును తొలగించి తన పేరు పెట్టుకునేంత గొప్పవాడా జగన్ అని నిలదీశారు. అన్ని కులాలు నావే అనే ఉద్దేశంతోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. తాను పోటీ చేసిన కుప్పుంలో కూడా తన కులం వాళ్లు పెద్దగా లేరని, చేసిన మంచి చూసే తనని గెలిపించారని వెల్లడించారు. ఓ ఎంపీ నగ్న వీడియో బయటకు వస్తే.. ఆడబిడ్డల గౌరవం గురించి ముఖ్యమంత్రి ఆలోచించలేదని చంద్రబాబు ధ్వజమెత్తారు.

ఎంపీని సమర్ధించే ప్రయత్నాలా
ఎంపీని సమర్థిస్తూ వీడియో ఫేక్ అని తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కొంతమంది పోలీసుల ఉన్మాదంతో ఇష్టానుసారం అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. రౌడీయిజానికి అంతా భయపడిపోవాలన్నట్లు కొందరి పోలీసుల ప్రవర్తన ఉందని వ్యాఖ్యానించారు. పోలవరం గుత్తేదారుల్ని మార్చే తొందరపాటు నిర్ణయం తగదని కేంద్రం సహా ఎవ్వరు చెప్పినా వినకుండా ముందుకెళ్లటంతోనే ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు. ఎదురుదాడితో చేసిన తప్పుల్ని సమర్థించుకోవాలని ప్రభుత్వం చూస్తుందని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే కులముద్ర వేసి అంశాన్ని మళ్లించటం అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications