ఎన్టీఆర్ 11 రోజులకే ఉద్యోగం వదిలేశారు: బాబు, 'భారత్ నుంచి దావోస్కు ఏకైక సీఎం'
విజయవాడ: స్వర్గీయ నందమూరి తారక రామారావు పదకొండు రోజుల్లోనే ప్రభుత్వ ఉద్యోగం వదిలేశారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు చెప్పారు. జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని విజయవాడలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. తొలినాళ్లలో సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగం సంపాదించిన ఎన్టీఆర్ ఆ పోస్టులో చేరిపోయారని, అయితే అక్కడి అవినీతి వాతావరణంలో ఇమడలేక ఎన్టీఆర్ కేవలం పదకొండు రోజులకే తన ఉద్యోగానికి రాజీనామా చేశారని చంద్రబాబు చెప్పారు.
మన దేశం నుంచి వెళ్తున్న ఏకైక సిఎం చంద్రబాబు
ఏపీ ప్రభుత్వ పారిశ్రామిక, ఆర్థిక విధానాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన ఉంటుందని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ సోమవారం చెప్పారు. అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక 46వ సదస్సులో 'సన్రైజ్ ఏపీ' బ్రాండ్ను ముఖ్య ఆకర్షణగా నిలుపుతామన్నారు.
సోమవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రపంచ ఆర్థిక సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారని, మన దేశం నుంచి హాజరవుతున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి అయన అని చెప్పారు.
గూగుల్, మైక్రోసాఫ్ట్, సాఫ్ట్బ్యాంక్, హెచ్పీ, ఫిలిప్స్, సీమెన్స్ తదితర సంస్థల ప్రతినిధులతోపాటు ప్రొ.క్లాస్ స్క్వాబ్లాంటి ఆర్థికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారన్నారు. రిజర్వ్ బ్యాంకు గవర్నరు రఘురాం రాజన్తో చంద్రబాబు ప్రత్యేక భేటీ ఉంటుందని చెప్పారు.