పవన్ను బీజేపీ వాడుకుంటోంది, బుద్ధి చెబుతారు: మహానాడులో చంద్రబాబు నిప్పులు
అమరావతి: పేదరికం లేని సమాజం చూడాలని ఎన్టీఆర్ కలలు కన్నారని తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సమాజమే దేవాలయం.. ప్రజలే నా దేవుళ్లు అన్న ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ మాత్రమేనని అన్నారు. సోమవారం ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని మహానాడులో చంద్రబాబు ప్రసంగించారు.
ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. సమాజానికి ఎనలేని సేవ చేసిన ఎన్టీఆర్కు భారతరత్న ఎందుకివ్వరని కేంద్రాన్ని నిలదీస్తామన్నారు.
గుండెల్లో నిలిచిపోయేలా ఎన్టీఆర్ చిత్రం
సంక్రాంతికి విడుదల కానున్న ఎన్టీఆర్ బయోపిక్ ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా తెరకెక్కించాలన్నారు. ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలని మరోసారి తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. అమరావతిలో ఎన్టీఆర్ మెమోరియల్కు త్వరలోనే శ్రీకారం చుడుతున్నామని చంద్రబాబు తెలిపారు. చరిత్రలో ఎంతో మంది పుడతారని కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేది మాత్రం కొందరేనని చంద్రబాబు అన్నారు. అలాంటి వారిలో ఎన్టీఆర్ అగ్రగణ్యులు అని పేర్కొన్నారు. చరిత్ర ఉన్నంత వరకు ఎన్టీఆర్ ప్రజలందరి మనసుల్లో ఉంటారని, చరిత్ర సృష్టించే యుగపురుషులు కొందరే ఉంటారని కొనియాడారు.
ఎన్టీఆర్ నుంచి చాలా నేర్చుకున్నా..
ఎన్టీఆర్ జీవితం అందరికీ ఆదర్శం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. తాను ఎన్టీఆర్ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నానని.. తాను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ను అనురాగ దేవత షూటింగ్లో కలిసిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ఎన్నో సంస్కరణలకు ఎన్టీఆర్ నాంది పలికారని, తెలుగు వారి ఆత్మ గౌరవానికి ఆయన ప్రతీకగా నిలిచారని కొనియాడారు. ప్రతి ఒక కార్యకర్త ఒక ఎన్టీఆర్ కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. పేదరికం లేని సమాజ స్థాపనకు ఎన్టీఆర్ బాటలో ముందుకు పోదామని పిలుపునిచ్చారు.
పవన్ను బీజేపీ వాడుకుంటోంది..
తనను విమర్శించడానికి భారతీయ జనతా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను వాడుకుంటోందని, బీజేపీ మాటలను నమ్మి ఆయన తనపై నిత్యమూ అర్థరహిత విమర్శలు చేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు.
బీజేపీ, పవన్కు ఒక్కశాతం ఓట్లు కూడా రావు..
పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తానని అంటున్నారని, వారు పోటీ చేస్తే, ఆంధ్ర రాష్ట్రంలో ఓట్లు వేసేవారు ఒక్క శాతం కూడా లేరని చంద్రబాబు ఎద్దేవా చేశారు. బీజేపీ ధోరణి వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా పోయిందని చంద్రబాబు చెప్పారు. అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి అన్ని రకాల బిల్లులనూ కేంద్రానికి పంపినా, తమకేవీ అందలేదని అమిత్ షా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
బీజేపీకి బుధ్ది చెబుతారు
జాతీయ స్థాయి నేతలు మాట్లాడాల్సిన తీరు ఇది కాదని చంద్రబాబు అన్నారు. అనవసరంగా తెలుగు రాష్ట్రంతో పెట్టుకుంటే, ఏం జరుగుతుందో కాంగ్రెస్కు తెలిసొచ్చిందని, తదుపరి ఎన్నికల్లో బీజేపీకీ ప్రజలు అదే విధంగా బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. నమ్మకద్రోహం, కుట్ర రాజకీయాలపై తాను ధర్మపోరాటం చేస్తున్నానని, ఈ పోరాటంలో ప్రజలే అండగా, తాను విజయం సాధిస్తానన్న నమ్మకం తనకుందని తెలిపారు.నమ్మక ద్రోహం చేసిన వారికి గుణపాఠం చెప్పేందుకు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 175సీట్లు గెలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
అమిత్ షాపై చంద్రబాబు నిప్పులు
అమరావతిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. అమరావతిలో పనులే ప్రారంభం కాలేదని షా చెప్పడం దారుణమన్నారు. యూసీలు పంపిస్తే నిజమైనవి కావని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు ఇచ్చి మొత్తం ఇచ్చేసినట్లు బుకాయిస్తారా? అని నిలదీశారు. అమరావతి ప్రణాళికలు ఇంకా సింగపూర్లోనే ఉన్నాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోలవరం, అమరావతి నిర్మాణాలకు నిధులు ఇవ్వకుండా మొండికేసి ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాకు, లోటు బడ్జెట్కు ఎలాంటి యూసీలు కావాలో అమిత్ షా చెప్పాలని ఎద్దేవా చేశారు. అమిత్ షా నిన్న చేసిన ప్రకటన పూర్తిగా అవాస్తవమైనదని చంద్రబాబు తెలిపారు. ఓ పార్టీ అధ్యక్షుడికి యూసీల విషయం ఎందుకని ప్రశ్నించారు. యూసీలు ఇచ్చామో.. లేదో ప్రధాని మోడీ చెప్పాలి గానీ.. అమిత్ షాకు ఎందుకని మండిపడ్డారు. పాలనా అంశాల్లో జోక్యం చేసుకోవడానికి ఆయనెవరని చంద్రబాబు నిలదీశారు.