జగన్రెడ్డి కాదు రివర్స్ రెడ్డి; సీమ ద్రోహులెవరు? ఇదేం ఖర్మ రాష్ట్రానికి: చంద్రబాబు ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసిపిపై ప్రతిపక్ష టిడిపి పెద్ద ఎత్తున యుద్ధం చేస్తోంది. ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ రాష్ట్రంలో అనేక అంశాలపైన తెలుగుదేశం పార్టీ వైసీపీ ప్రభుత్వం పై పోరాటం చేస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు రాకుండా పారిపోతున్నాయి అని పదేపదే టార్గెట్ చేస్తుంది. ఇక తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దీటుగా ఇదేం ఖర్మ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించిన టిడిపి రాష్ట్ర వ్యాప్తంగా 45 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ప్రజలలో చర్చ జరిగేలా అనేక సమస్యల పైన పోరాటం చేయడంతో పాటు, ప్రజలకు సమస్యల పైన అవగాహన కల్పించాలని నిర్ణయించింది.
పాలకులు రాక్షసులైతే ఫలితాలు ఎలా ఉంటాయో మన రాష్ట్రమే ఉదాహరణ : చంద్రబాబు
రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలియజేసి, ప్రజాకోర్టులో ప్రభుత్వాన్ని నిలబెట్టాలని ఉద్దేశంతో సాగిస్తున్న ఈ పోరాటంలో రాష్ట్రంలో జరుగుతున్న అనేక అంశాలను తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.పాలకులు రాక్షసులైతే ఫలితాలు ఎలా ఉంటాయో మన రాష్ట్రమే ఉదాహరణ అంటూ పేర్కొన్నారు చంద్రబాబు. రాయలసీమలో నాడు మేము తెచ్చిన పరిశ్రమలు నేడు ఎందుకు వెళ్లిపోయాయి? చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు.
సీమ ద్రోహులు ఎవరు? ఆ కంపెనీ వెనక్కు వెళ్ళిపోవటంపై చంద్రబాబు టార్గెట్
పెట్టుబడులను తరిమేసింది ఎవరు? సీమ ద్రోహులు ఎవరు? అంటూ నిలదీసిన చంద్రబాబు సీమకు పరిశ్రమలు తెచ్చిన మేమా...లేక కాసులకు కక్కుర్తి పడి కంపెనీలను వెళ్లగొట్టిన మీరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను మేపలేక జాకీ కంపెనీ పరార్ అయిందంటూ చంద్రబాబు ఒక పోస్టు పెట్టారు. అంతేకాదు ముఖ్యమంత్రి పర్యటనకు నరసాపురంలో ఇష్టారాజ్యంగా చెట్లను నరికి వేశారని, రహదారి పొడవునా బారికేడ్లు ఏర్పాటు చేసి, దుకాణాలను మూసి వేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారని ఈ పోస్ట్ పెట్టిన చంద్రబాబు సార్ వస్తున్నారు అంటే అంతే అంటూ జగన్మోహన్ రెడ్డి పర్యటనను టార్గెట్ చేశారు.
ఇది కదా రివర్స్ రెడ్డి రివర్స్ పాలన
సాధారణంగా ప్రజాప్రతినిధులు తమ పర్యటనల్లో మొక్కలు నాటడం ఇన్నాళ్లూ చూశాం. కానీ సీఎం వస్తున్నారని భారీ వృక్షాలను...అది కూడా ఏ మాత్రం అడ్డుగాలేని చెట్లను నరికి వేయడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నాం అంటూ అసహనం వ్యక్తం చేశారు. మొక్కలు నాటడం నేర్పాల్సిన పాలకులు...చెట్లు నరికెయ్యమని సందేశం పంపుతున్నారా? అంటూ ప్రశ్నించిన చంద్రబాబు ఇదే కదా రివర్స్ పాలన అంటే అని విమర్శించారు. నువ్వు జగన్ రెడ్డి కాదు... రివర్స్ రెడ్డి అంటూ జగన్మోహన్రెడ్డిని టార్గెట్ చేశారు.

తిరుపతిలో నడిరోడ్డుపై మహిళ ప్రసవంపై చంద్రబాబు పోస్ట్
అంతకుముందు తిరుపతిలో నడి రోడ్డుపై మహిళ ప్రసవం గుండెను కలిచివేసింది అని పేర్కొన్న చంద్రబాబు, ప్రసవానికి వచ్చిన మహిళకు సహాయకులు లేరని ఆ మహిళలు ప్రసూతి ఆసుపత్రి సిబ్బంది చేసుకోకపోవడం దారుణమని చంద్రబాబు పేర్కొన్నారు. స్థానికులు దుప్పట్లను అడ్డుపెట్టి ప్రసవం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు. ఇటువంటి దుస్థితిపై ఎలా చెప్తే ప్రభుత్వానికి అర్థమవుతుందని ప్రశ్నించిన చంద్రబాబు వ్యవస్థల విధ్వంసం అంటే ఇదేనని పేర్కొన్నారు. తిరుపతి ఘటనతో తన హృదయం చలించి పోతుందని చంద్రబాబు ఈమేరకు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications