వారసుడు లోకేష్ అయితే, తప్పులు అంధ్రప్రజలవా: బాబుపై జగన్ పార్టీ ఎమ్మెల్యే
హైదరాబాద్: పట్టిసీమ నీటి పారుదల ప్రాజెక్టు డబ్బులు తెచ్చి శాసనసభ్యులను కొనబోయి అడ్డంగా దొరికిపోయారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్పులు చేసి ఆ తప్పును ఆంధ్ర ప్రజల తప్పుగా చూపిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
అక్రమ సంపాదనకు వారసుడు లోకేష్ అయితే, చంద్రబాబు చేసిన తప్పులు ఆంధ్రప్రజలవా, ఇదెక్కడి న్యాయమని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)తో తమ పార్టీ కుమ్మక్కయిందని అనడం సరి కాదని ఆయన అన్నారు. టిఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కుమ్మక్కయ్యాయని టిడిపి చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు.
టిఆర్ఎస్ కండువా కప్పుకున్నది, కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది టిడిపియేనని ఆయన అన్నారు. రాష్ట్రానికి ఫోన్ ట్యాపింగ్ నేర్పింది చంద్రబాబేనని ఆయన అన్నారు. ఫోన్ ట్యాపింగ్ సిద్ధాంతం చంద్రబాబుది కాదా అని ఆయన ప్రశ్నించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 70 మండలాల్లోని ఎంపిటిటిసిలను చంద్రబాబు కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు.
కర్నూలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన జడ్పీటిసిలను కూడా టిడిపి కొనుగోలు చేసిందని ఆయన అన్నారు. తమ పార్టీ తరఫున గెలిచిన ఇద్దరు పార్లమెంటు సభ్యులను చంద్రబాబు తన పార్టీలోకి తీసుకుని వెళ్లిన విషయం నిజం కాదా అని చెవిరెడ్డి అన్నారు.