చంద్రబాబుకు మోడీ ఫోన్ కాల్: కరోనాపై బాబు సూచనలు, పూర్తి మద్దతు, ఇంకా ఏం చెప్పారంటే.?
అమరావతి: కరోనా లాక్డౌన్ పొడిగింపు నేపథ్యంలో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడారు. కరోనావైరస్ కట్టడి కోసం దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్డౌన్ను పొడిగించడాన్ని తాము సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నట్లు చంద్రబాబాబు ప్రధానికి తెలిపారు.

చంద్రబాబుకు ప్రధాని మోడీ ఫోన్..
హైదరాబాద్లో మంగళవారం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. కరోనా నియంత్రణ చర్యలపై ప్రధాని మోడీకి ఇటీవల లేఖ రాసి కొన్ని సూచనలు చేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఇలాంటి సున్నితమైన అంశాలపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు. సోమవారం ప్రధాని కార్యాలయానికి ఫోన్ చేసి.. ఆయనతో మాట్లాడాలని అడిగినట్లు తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 8.30 గంటలకు నరేంద్ర మోడీ తనకు ఫోన్ చేశారని చంద్రబాబు తెలిపారు. కరోనా నియంత్రణకు సంబంధించి ప్రధాని మోడీకి పలు సూచనలు చేయగా.. ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.

విపత్కర సమయంలో ప్రాణాలే ముఖ్యం..
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అందరితో కలిసి పనిచేయాలని ప్రధాని భావిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఇందుకు తాను ధన్యవాదులు చెప్పానని తెలిపారు. కంటికి కనిపించని శత్రువైన కరోనాను లాక్డౌన్తో కొంత వరకు కట్టడి చేయగలుగుతున్నామని చెప్పారు. ఆర్థిక వ్యవస్థకు ఇదో పెను సవాలుగా మారిందన్నారు. అయితే, ఈ విపత్కర సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని చంద్రబాబు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తాత్కాలిక ఇబ్బందులు ఎదురైనా అందరూ కలిసి పోరాడుతేనే కరోనాపై విజయం సాధించగలుగుతామని అన్నారు.

అగ్రదేశాలే అల్లాడిపోతున్నాయి..
ప్రతి ఒక్కరూ కూడా లాక్డౌన్ నిబంధనలను పాటించి కరోనాను కట్టడి చేసేందుకు సహకరించాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. సామాజిక దూరం పాటించాలని కోరారు. కరోనాతో అగ్ర దేశాలే అతలాకుతలమవుతున్నాయని, అక్కడ వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి ప్రజలు, ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే మనదేశంలో, రాష్ట్రంలో ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు.

అహంభావం వద్దు.. పరీక్షలు పెంచాలి..
సున్నితమైన అంశాలపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ‘నాకే అన్నీ తెలుసు' అనే అంహంభావం ఎవరికీ పనికిరాదని అన్నారు. ప్రధాని ప్రతిపాదించిన ఏడు సూత్రాలు అమలు చేయాలని పిలుపునిచ్చారు. ఏపీలో అధికార యంత్రాంగం స్పందించి నిత్యావసరాలను డోర్ డెలివరీ చేసినట్లయితే కరోనాను చాలా వరకు నియంత్రించవచ్చని అన్నారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడమే సమస్యకు పరిష్కారమని అన్నారు. ఏపీలో కరోనా పరీక్షలు చేయించుకునేవారి సంఖ్య తగ్గిందని, ఎక్కువ మంది నమూనాలను సేకరించాలని సూచించారు. ఈ విపత్కర సమయంలో పేదలను ఆదుకోవాలని ప్రధాని పిలుపునిచ్చినా రాష్ట్రంలో వైసీపీ సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications