అదే బస్సు: 16 నుంచి ప్రజల వద్దకు చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 16 నుంచి ప్రజల మద్యకు కార్యక్రమం చేపట్టనున్నారు. ఆయన తన పర్యటనను వినూత్నంగా రూపొందించుకుంటున్నారు. చంద్రబాబు ఒక దఫా పర్యటనలో రెండు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారు.
జిల్లాలో రెండు నియోజకవర్గాలకు రెండు రోజులు కేటాయించనున్నారు. డ్వాక్రా మహిళలు, రైతులతో విడివిడిగా చంద్రబాబు నాయుడు ముఖాముఖి మాట్లాడనున్నారు. జిల్లా అధికారులకూ, పార్టీ కార్యకర్తలకూ సమయం కేటాయించనున్నారు.
పాదయాత్ర సమయంలో బస కోసం ఉపయోగించిన బస్సునే ఇప్పుడూ రాత్రిపూట బసకు చంద్రబాబు ఉపయోగించుకోనున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐపీఎస్ బదిలీలకు రంగం సిద్ధం చేసినట్లుగా సమాచారం.
ఖాళీగా ఉన్న విశాఖ కమిషనర్, ఏలూరు రేంజ్ డీఐజీ, రాయలసీమ రేంజ్ ఐజీ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. పోలీసుల బదిలీలపై చంద్రబాబు నాయుడు శుక్రవారం సుదీర్ఘ సమీక్ష జరిపినట్లు తెలియవచ్చింది.