బాబుకు మల్కాజి'కిరి': తెరపైకి మూడో కృష్ణుడు
హైదరాబాద్: మల్కాజిగిరి లోకసభ స్థానం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా మారింది. మల్కాజిగిరి సీటుపై పార్టీ మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి పట్టుబట్టి కూర్చున్నారు. ఇదే సమయంలో మూడో కృష్ణుడు ఆ సీటు కోసం తెర మీదికి వచ్చాడు. తాజాగా, పార్టీ రాజ్యసభ సభ్యుడు టి. దేవేందర్ గౌడ్ తనయుడు వీరేంద్ర గౌడ్ మల్కాజిగిరి లోకసభ స్థానం టికెట్ అడుగుతున్నారు.
ఉప్పల్ శాసనసభ స్థానాన్ని వీరేంద్ర గౌడ్ అశించారు. బిజెపితో పొత్తు కారణంగా ఆ సీటును తెలుగుదేశం వదులుకుంది. దీంతో మల్కాజిగిరి లోకసభ స్థానం కోసం వీరేంద్ర గౌడ్ పట్టుబడుతున్నారు. తన కుమారుడికి టికెట్ ఇవ్వాల్సిందేనని దేవేందర్ గౌడ్ కూడా చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఎంతగా బుజ్జగించినప్పటికీ తనకు మల్కాజిగిరి లోకసభ స్థానం టికెట్ కావాల్సిందేనని రేవంత్ రెడ్డి మొండికేస్తున్నారు.
రేవంత్ రెడ్డితో పార్టీ నేతలు పయ్యావుల కేశవ్, సుజనా చౌదరి, సిఎం రమేష్ జరిపిన చర్చలు ఫలించలేదు. దీంతో బిజెపి నేత ఎం. వెంకయ్యనాయుడిని కలిసి సుజానా చౌదరి చర్చలు జరిపేందుకు ఉపక్రమించారు. తెలుగుదేశం పార్టీ నుంచి మల్కాజిగిరి సీటును మల్లారెడ్డి ఆశిస్తున్నారు. రేవంత్ రెడ్డి, మల్లారెడ్డిలను తప్పించి వీరేంద్ర గౌడ్కు మల్కాజిగిరి టికెట్ ఇవ్వాలనే ఆలోచనకు చంద్రబాబు వచ్చినట్లు తెలుస్తోంది.
కాగా, మల్కాజిగిరి నుంచి నామినేషన్ వేసిన లోకసత్తా నేత జయప్రకాష్ నారాయణకు మద్దతు ఇవ్వాలని బిజెపి నాయకత్వం చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. జయప్రకాష్ నారాయణ మల్కాజిగిరి నుంచి పట్టుబట్టి పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. మరోవైపు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి మాజీ డిజిపి దినేష్ రెడ్డి మల్కాజిగిరి సీటు నుంచి పోటీకి దిగుతున్నారు. ఎమ్మెల్సీ నాగేశ్వర్ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు.
కాంగ్రెసు నుంచి సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ పోటీకి దిగుతున్నారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన మైనంపల్లి హనుమంతరావు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థిగా మల్కాజిగిరి లోకసభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. మొత్తం మీద, మల్కాజిగిరి లోకసభ స్థానం సీమాంద్ర నాయకులకు అత్యంత ఆకర్షణీయమైన సీటుగా కనిపిస్తోంది. అయితే, దానిపై పట్టు కోల్పోవడానికి తెలంగాణ నాయకులు సిద్ధంగా లేరు. మొత్తం మీద, మల్కాజిగిరిపై తలెత్తిన వివాదం తెలుగుదేశం పార్టీలో తీవ్రమైన గందరగోళానికి దారి తీస్తోంది. కాగా, నామినేషన్ దాఖలు చేయడానికి బుధవారం చివరి రోజు.