"బాబు! ఏం ముఖం పెట్టుకుని నంద్యాలలో.. తాటాకు చప్పుళ్లకు భయపడరు"
ఇప్పటికే నంద్యాల ప్రాంతంలోని బలహీనవర్గాలపై పోలీసులను ప్రయోగించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు.
కర్నూలు: మంత్రులే తీవ్ర స్థాయిలో అవినీతికి పాల్పడుతుంటే.. ఏ ముఖం పెట్టుకుని వచ్చి నంద్యాలలో ఓట్లు అడుగుతారని సీఎం చంద్రబాబును వైసీపీ నేత బొత్స సత్యానారాయణ నిలదీశారు. దోచుకున్న డబ్బుతో ఓటుకు రూ.5వేలు ఇవ్వగలనని చంద్రబాబు చెబుతున్నారని, ఆయన కంటికి అంతా భిక్షగాళ్లలా కనిపిస్తున్నారని ఫైర్ అయ్యారు.
గత ఎన్నికల్లో కర్నూలు జిల్లాకు ఇచ్చిన 33హామిలను ఇప్పటివరకు నెరవేర్చని చంద్రబాబు.. కొత్తగా మరోసారి నంద్యాల ప్రజలను మోసం చేయడానికి సిద్దమవుతున్నారని ఆరోపించారు. ఇచ్చిన మాటను చంద్రబాబు ఎప్పుడైనా నిలబెట్టుకోగలిగారా? అని బొత్స ప్రశ్నించారు. నంద్యాల ఉపఎన్నికలలో టీడీపీ ప్రలోభాలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇచ్చిన హామిల పట్ల చిత్తశుద్ది లేకనే వాటిని నెరవేర్చడంలో సీఎం విఫలమయ్యారని ఆరోపించారు. గతంలోను రాష్ట్రంలో ఉపఎన్నికలు వచ్చాయని, నంద్యాల ఉపఎన్నికకు మాత్రమే ఎందుకింత ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దంగా నంద్యాల ఉపఎన్నిక జరుగుతోందని, అక్రమాలు, అరాచకాలతో ఉపఎన్నికల్లో గెలవాలని టీడీపీ కుట్ర పన్నుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇప్పటికే నంద్యాల ప్రాంతంలోని బలహీనవర్గాలపై పోలీసులను ప్రయోగించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. అయితే టీడీపీ తాటాకు చప్పుళ్లకు జనం భయపడరన్న సంగతి గుర్తుంచుకోవాలని చంద్రబాబును హెచ్చరించారు. ఉపఎన్నికలో నంద్యాల ప్రజలు దుష్ట శక్తులకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.