కొత్త ఇబ్బందులేంటి: ఎమ్మెల్యేల రిజైన్ హెచ్చరికలపై బాబు సీరియస్
పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్సైని దుర్భాషాలాడిన విషయంలో తెలుగుదేశం పార్టీలో మరో కొత్త ట్విస్ట్. అవసరమైతే పదవులకు రాజీనామా చేస్తామని ఎమ్మెల్యేలు చెప్పారు. దీనిపై నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు.
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్సైని దుర్భాషాలాడిన విషయంలో తెలుగుదేశం పార్టీలో మరో కొత్త ట్విస్ట్. అవసరమైతే పదవులకు రాజీనామా చేస్తామని ఎమ్మెల్యేలు చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు.
విధి నిర్వహణలో ఉన్న ఎస్సై, రైటర్ను దుర్భాషాలాడిన వ్యవహారంలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆగ్రహానికి గురయింది.
12 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఇప్పటికే గన్మెన్లను వెనక్కి పంపించారు. ఆ తర్వాత వారు మరో అడుగు ముందుకేశారు. తాను ఏ తప్పు చేయలేదని, ఎవరికి భయపడనని, నాది తప్పని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ భావిస్తే రాజీనామా కూడా చేస్తానని ఎమ్మెల్యే రాధాకృష్ణ స్పష్టం చేశారు.
తాడోపేడో తేల్చుకుంటాం
చాలా కాలం ఓపిక పట్టామని, ప్రజలకు న్యాయం చేయాలని చూస్తే ఎమ్మెల్యేపైనే కేసు పెట్టారని, ఈ విషయంలో పోలీసులతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మిగతా ఎమ్మెల్యేలు కూడా ప్రకటించారు.
రాజీనామాలకు సిద్ధం
ఎస్పీ భాస్కర్ భూషణ్ను ఇక్కడి నుంచి పంపించాలని, ఆయన ఆగడాలకు అంతం లేకుండా పోయిందని, పార్టీకి ఆయన చేటు తెస్తున్నారని, ఎస్పీని పంపించకపోతే మేం రాజీనామాలకు సిద్ధమని నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆగ్రహించారు.
బాబు అసహనం.. ఎవరూ రావొద్దని
మరోవైపు, పశ్చిమ గోదావరికి చెందిన ఎమ్మెల్యేల తీరుపట్ల సీఎం చంద్రబాబు ఆగ్రహం, అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే తనను కలిసేందుకు ఎవ్వరూ అక్కడికి రావొద్దని ఇంచార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ద్వారం సందేశం పంపించారని అంటున్నారు.
ఏదైనా ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలి
ఎస్పీ విషయం తేల్చేదాకా కమిటీల ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతున్నట్లు ముఖ్యమంత్రికి తెలిసిందని, దీంతో ఏదైనా ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలని, ఇలా కమిటీ ఎన్నికల వాయిదా వేయడం సరికాదని చంద్రబాబు అన్నారని తెలుస్తోంది. దీంతో జిల్లా కమిటీ సభ్యులకు సంబంధించిన ప్రక్రియ సాగింది.
మంగళవారం పిలుపు!
ఎమ్మెల్యేలను మంగళవారం విజయవాడకు పిలిపించి మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే అనేక ఇబ్బందులు ఉన్నాయని, దీనికి తోడు కొత్త ఇబ్బందులా అని ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఆ తర్వాత ఎమ్మెల్యేలు తనకు ఈ విషయం చెప్పడంపై బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ సమన్వయంతో పని చేయాలని హితవు పలికారు.