ఎపికి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చ: ఎంపీలపై చంద్రబాబు సీరియస్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా పార్టీ పార్లమెంటు సభ్యుల వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పార్లమెంటు సభ్యులపై ఆయన మండిపడినట్లు తెలుస్తోంది.
పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను ఖరారు చేసుకుని ముందుకు వెళ్లాలని తాను సూచించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, అలా వ్యూహాలను ఎప్పటికప్పుడు మార్చుకోవడంలో విఫలమయ్యారని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీ వాకౌట్ చేస్తుంటే అందుకు అనుగుణమైన వ్యూహాన్ని తమ పార్టీ ఎంపీలు అనుసరించలేకపోయారని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం.

పార్టీ పార్లమెంట్ సభ్యులతో ఆయన శుక్రవారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు, అధికారులతో ఆయన చర్చలు జరిపారు. చర్చ సందర్భంగా ఎన్డియె ప్రభుత్వాన్ని, సమాధానం ఇచ్చిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని తప్పు పడుతూ ఎంపి సిఎం రమేష్, మంత్రి సుజనా చౌదరి పలుమార్లు మాట్లాడారు. ఈ స్థితిలో రాజ్యసభలో ప్రత్యేక హోదాపై జరిగిన చర్చపై చంద్రబాబు సమీక్ష జరిపారు.
ప్రభుత్వంలో భాగమైన పార్టీ సభ్యుడివై ఉండి ఇలా మాట్లాడవచ్చునా అని సభాధ్యక్షస్థానంలో ఉన్న కురియన్ సిఎం రమేష్ను అడిగారు. సుజనా చౌదరి మాట్లాడుతున్నప్పుడు కురియన్ మరో వ్యాఖ్య చేశారు. మంత్రిగా ఉంటూ ఆ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఆసాధారణమైన విషయమని ఆయన అన్నారు. ఈ స్థితిలో ఎన్డియే ప్రభుత్వం నుంచి టిడిపి వైదొలగాలనే డిమాండ్ ఊపందుకునే ప్రమాదం ఉంది.












Click it and Unblock the Notifications