టీపై మాట్లాడే హక్కు నాకే ఉంది, కెసిఆర్కు లేదు: బాబు
ఒంగోలు: తెలంగాణ గురించి కానీ, హైదరాబాద్ గురించి కానీ మాట్లాడే హక్కు ఒక్క చంద్రబాబుకే ఉందని, కెసిఆర్కు లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణ అభివృద్ధిపై చర్చకు రమ్మని సవాల్ చేస్తే పారిపోయాడని అయన అన్నారు. కాంగ్రెస్ రాష్ట్రాన్ని చీకటి, మద్యాంధ్రప్రదేశ్గా మార్చి భ్రష్టు పట్టించిందని, మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఒక్క తమ పార్టీకే సాధ్యమని చంద్రబాబు అన్నారు.
దేశంలోని అవినీతిపై కొదమ సింహాల్లా గర్జించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని, దీనివల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, అవినీతి, అక్రమాలు, కుట్రలపైనే ప్రజాగర్జన అని ఆయన అన్నారు. సోమవారం ఒంగోలులోని మినీ స్టేడియం ఆవరణలో జరిగిన ప్రజాగర్జన సభలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడాలని శ్రీవేంకటేశ్వర స్వామిని కోరుకున్నానని తెలిపారు.

నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, కాంగ్రెస్ దుర్మార్గ పాలనలో అన్ని పెరిగిపోయాయని, ప్రజలకు ఆదాయం మాత్రం పెరగలేదని, ప్రతి ఒక్కరూ అప్పుల్లో కూరుకుపోయారని, దీనంతటికి కారణం కాంగ్రెస్ అవినీతి, అక్రమాలే కారణమని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అక్రమాస్తులు బయటపడ్డాయని, రూ. 43 వేల కోట్ల అవినీతి జరిగిందని సిబిఐ చార్జిషీటు వేసిందని, అయినా ప్రభుత్వం ఏమీ చేయలేక, చేతకాక ఊరుకుందని ఆయన అన్నారు.
తమ హయాంలో ప్రజలకోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని, రైతు బజార్లు ఏర్పాటు చేశామని, ఎక్కడా ధరలు పెరిగితే వాటిపై దృష్టిపెట్టి తగ్గించిన ఘనత తమదేనని ఆయన చెప్పుకున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆథార్ కార్డుతో సంబంధం లేకుండా ఏడాదికి 10 సిలెండర్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ధరలు తగ్గిస్తామని, విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చంద్రబాబు చెప్పారు.
రాష్ట్రంలో అభివృద్ధి కుంటుబడిందని, దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ అవినీతేనని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ప్రజలు మళ్లీ పిలుస్తున్నారని, చంద్రబాబు రావాలని కోరుతున్నారని, అది సత్యమని ఆయన అన్నారు. తనకు పదవులపై వ్యామోహం లేదని, కానీ రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications