చంద్రబాబు వర్సెస్ బిజెపి: పవన్ కల్యాణ్ తేల్చేదేమిటి?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అందించే సాయంపై బిజెపికి, తెలుగుదేశం పార్టీకి మధ్య వార్ నడుస్తోంది. ఒక రకంగా సోము వీర్రాజుకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మధ్యనే ఈ సమరం సాగుతోంది.
Recommended Video
కేంద్రం రాష్ట్రానికి అందజేసిన సాయంపై సోము వీర్రాజు కుండ బద్దలు కొట్టినట్లే చెప్పారు. లెక్కలు కూడా అందించారు. బిజెపి రాష్ట్రాధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేంద్రం అందించిన సాయంపై వివరించారు.
చంద్రబాబు వాదన ఇదీ..
రాష్ట్రానికి అందించిన సాయంపై చంద్రబాబు అన్యాయం జరుగుతోందని చంద్రబాబు అంటున్నారు. రాజధాని నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకు నిధులు సరిగా ఇవ్వడం లేదని, రెవెన్యూ లోటును తీర్చడం లేదని ఆయన అంటున్నారు. పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు కేంద్రం రాష్ట్రానికి సాయం చేయాలని అంటున్నారు. కానీ, స్పష్టంగా ఎంత ఇవ్వాలనే విషయాన్ని ఆయన గానీ తెలుగుదేశం పార్టీ నాయకులు గానీ చెప్పడం లేదు. రెవెన్యూ లోటును మాత్రం 16 వేల కోట్లుగా చెబుతున్నారు.
బిజెపి వాదన ఇదీ...
అయితే, రెవెన్యూ లోటు విషయంలో బిజెపి వాదన మరో విధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లోటు కేవలం రూ.4600 కోట్లు మాత్రమేనని సోము వీర్రాజు చాలాసార్లు చెప్పారు. రుణమాఫీ, సంక్షేమ పథకాలు కలిపి రూ.16 వేల కోట్లు అవుతోందని, ఆ మొత్తాన్ని చంద్రబాబు ప్రభుత్వం లోటుగా చూపిస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కేంద్రం సాయం చేయాల్సిన అవసరం లేదని బిజెపి వాదిస్తంది.
90 శాతం హామీలు నెరవేర్చామని..
విభజన చట్టంలోని 90 శాతం హమీలను కేంద్రం నెరవేర్చినట్టు బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. మరో పది శాతం మిగిలి ఉన్నట్లు చెప్పారు. అసలు విభజన హామీలను నెరవేర్చడానికి 2022 వరకు సమయం ఉందని బిజెపి వాదిస్తోంది. ఉత్తరాంధ్రకు రూ.2010 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటికే 1500 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రానికి 16 విశ్వవిద్యాలయాలను మంజూరు చేసినట్లుగా కూడా చెప్పారు.
పోలవరంపై ఇలా..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయమంతా కేంద్రమే భరిస్తుందని బిజెపి స్పష్టంగానే చెబుతోంది. పైగా దాన్ని 2019 నాటికి పూర్తి చేస్తామని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గడ్కరీ చెబుతున్నారని, ఇంకా చంద్రబాబు ప్రభుత్వం గొడవ చేయాల్సిన అవసరమేమి ఉందని అంటోంది.
రాజధాని నిర్మాణంపైనా ఇలా...
రాజధాని నిర్మాణంపై అసలు ప్రభుత్వానికి ఓ ప్లాన్ లేదని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ హైకోర్టు, రాజభవన్ నిర్మాణాలకు కేంద్రం రూ.1500 కోట్లు కేంద్రం ఇచ్చిందని, రాజధాని ప్రాంత అభివృద్ధికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి నిరుడు వెంకయ్య నాయుడే రూ.1000 కోట్లు ఇచ్చారని సోము వీర్రాజు చెప్పారు.
రైల్వే జోన్పైనా ఇలా..
రైల్వే జోన్కు కూడా బిజెపి కొలికి పెడుతోంది. రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్టులను కూడా పరిశీలించాలని మాత్రమే విభజన చట్టంలో ఉంది గానీ తప్పనిసరిగా చేయాలని లేదని సోము వీర్రాజు అన్నారు. విడిపోయిన రాష్ట్రాల్లో ఎక్కడా రైల్వే జోన్ లేదని ఆయన చెప్పారు. అయితే, విభజన హామీల అమలుకు పదేళ్ల గడువు ఉందని కూడా బిజెపి వాదిస్తోంది.
పవన్ కల్యాణ్ ఏం తేలుస్తారు..
చంద్రబాబు ఓవైపు, బిజెపి నేతలు మరో వైపు ఎవరి లెక్కలు వారు చెబుతుంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన నిజ నిర్దారణ కమిటీ ద్వారా ఏం తేలుస్తారనేది అర్థం కాకుండా ఉంది. పైగా, కేంద్రం గానీ, రాష్ట్రం గానీ ఆయనకు లెక్కలు ఇవ్వనలేదు. ఏమైనా అంటే, వెబ్సైట్లో ఉన్నాయి చూసుకోమంటున్నారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు వైపు మొగ్గు చూపుతున్నారని బిజెపి గుర్రుగా ఉన్నట్లు కనిపిస్తోంది.
ప్రత్యేక హోదాను పక్కన పెట్టినట్లే...
ప్రత్యేక హోదాను చంద్రబాబు ఎప్పుడో పక్కన పెట్టేశారు. పవన్ కల్యాణ్ కూడా దాన్ని పక్కన పెట్టినట్లే కనిపిస్తున్నారు. ప్రత్యేక హోదా వల్ల చేకూరే ప్రయోజనాలను ప్రత్యేక ప్యాకేజీ ద్వారా కల్పిస్తామని కేంద్రం అంటోంది. ఇప్పుడు ప్రత్యేక హోదా వల్ల ఒనగూరే లాభాలేమిటి, కేంద్రం ఏం ఇవ్వాల్సి ఉంటుందని పవన్ కల్యాణ్ తేల్చాల్సి ఉంటుంది. ఆ లెక్కన కేంద్రం రాష్ట్రానికి పది వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందని జయప్రకాష్ నారాయణ ఇది వరకే చెప్పారు. పవన్ కల్యాణ్ ఏం తేలుస్తారనేది కాస్తా ఆసక్తికరమైన విషయమే.