చంద్రబాబు ‘ప్రత్యేక’ హామీ: విలీన మండలాల్లో బాధితులకు పరామర్శ, జగన్పై ఫైర్
అమరావతి: తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత విలీన మండలాల ప్రజలు అన్ని విధాలా అండగా ఉంటామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం విలీన మండలాల్లో పర్యటించిన చంద్రబాబు.. ముంపు బాధితులందరినీ ఆదుకుంటామని చెప్పారు. ఏలూరులోని బొండ్లబోరు, శివకాశీపురంలో పర్యటించిన సందర్భంగా వైసీపీ సర్కారుపైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు చంద్రబాబు.
గోదాట్లో ముంచేశాడని జగన్పై చంద్రబాబు ఫైర్
తాను కష్టాల్లో ఉంటే పాదయాత్ర చేసిన జగన్.. ప్రజలకు కష్టం వస్తే గోదాట్లో ముంచేశాడని చంద్రబాబు మండిపడ్డారు. పోలవరం ముంపు బాధితులకు రూ. 2వేల కోట్ల పరిహారమైతే ఇస్తానని.. మొత్తం తన వల్ల కాదని జగన్ చెప్పడం బాధ్యతా రాహిత్యమని అన్నారు. గోదావరిలో కొట్టుకుపోయిన పశువుల్ని కూడా సీఎం జగన్ కాపాడలేకపోయారన్నారు.
ముంపు ప్రాంతాలను కలిపి ప్రత్యేక జిల్లా చేస్తామన్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పోలవరం ముంపు ప్రాంతాలను ప్రత్యేక జిల్లా చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ముంపు బాధితులందర్నీ ఆదుకుంటామన్నారు. పోలవరం కాంటూర్ లెవల్ 41.15వరకు వారికే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తానంటే తగదని.. కాంటూర్ లెవల్ 45.75వరకు ఉన్న వారికి నష్ట పరిహారం ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు. తాను అధికారంలో ఉన్నప్పుడు కట్టించిన ఆశ్రమ పాఠశాలలే ఇప్పుడు వరద బాధితులకు సహాయ శిబిరంగా మారిందన్నారు. వరద బాధితులకు ప్రభుత్వం 2 వేలు రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుందని చంద్రబాబు ధ్వజమెత్తారు. అమరావతి రైతులు అందించిన నిత్యావసర సరుకులను చంద్రబాబు వరద బాధితులకు పంపిణీ చేశారు.
ఆ భయంతోనే జగన్ పర్యటనలంటూ చంద్రబాబు
వరద బాధితుల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతకాదంటూ చేతులెత్తేసిందని మండిపడ్డారు. గత వారం వరద ముంపు ప్రాంతాల్లో తాను పర్యటించాకే విధిలేని పరిస్థితుల్లో జగన్ పర్యటించారన్నారు. ఇప్పుడైనా పర్యటించకపోతే.. ప్రజలు తిరగపడతారనే భయంతోనే జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని చంద్రబాబు విమర్శించారు. బారికేడ్ల చాటునే సీఎం పర్యటన సాగిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఇచ్చే 2వేల రూపాయలు బురద కడిగేందుకు కూడా సరిపోవని మండిపడ్డారు. పోలవరం ముంపు బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ సరిహద్దుల్లో చంద్రబాబుకు ఘనస్వాగతం
కాగా, పోలవరం విలీన మండలాల్లోని.. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్తున్న చంద్రబాబుకు తెలంగాణ సరిహద్దులో.. పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ముత్తగూడెం వద్ద తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు బక్కని నరసింహులు, ఇతర నేతలు పార్టీ అధినేతకు స్వాగతం పలికారు. ఖమ్మం జిల్లా సత్తుల్లిలోనూ పార్టీ నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.