కడప అంటేనే: కూల్చేసిన జగన్ మామ ఇంటివద్ద బాబు
హైదరాబాద్: వైయస్ రాజశేఖర రెడ్డి వల్ల కడప పేరు వింటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు. హైదరాబాదులోని కృష్ణా నగర్లో అక్రమంగా నిర్మించిన కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి భవనాన్ని హైకోర్టు ఆదేశాలతో జిహెచ్ఎంసి అధికారులు కూల్చివేసిన ప్రదేశాన్ని బాబు సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాఫియాతో పోరాటం అంటే మామూలు విషయం కాదని, నీరజా రావు పోరాటం అభినందనీయని చంద్రబాబు అన్నారు. నగరంలో చాలాచోట్ల ఇలాంటి మాఫియా భూ ఆక్రణలకుపాల్పడిందని, టిడిపి హయాంలో రౌడీలు, గూండాల పేరు వినిపించకుండా చేశామన్నారు. బోర్డులు పెట్టి ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా కాపాడామన్నారు.
స్థలం ఆక్రమణ చూస్తే చాలా బాదేస్తుందని అన్నారు. భూ కబ్జాల వ్యవహారంలో రవీంధ్రనాథ్ రెడ్డి మనుషులు ఎక్కడికక్కడ అల్లుకుపోయారన్నారు. స్థలం కబ్జా చేసి లక్ష్మీరాజ్యం పేరిట రిజిష్టర్ చేయించారని, వీరికి ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ సహకరించి రిజిష్టర్ చేయించారని విమర్శించారు. ఇక్కడ ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్న వారి స్థలాలకు రిజిష్టర్ చేయకుండా, రవీంధ్రనాథ్ కబ్జా స్థలానికి రిజిష్టర్ చేశారని ఆయన మండిపడ్డారు.
ఏదో ఒక విధంగా పైవేట్, ప్రభుత్వ ఆస్తులకు ఒక లిటికేషన్ పెట్టి స్థలాలను కబ్జా చేస్తున్నారని, ఎవరైనా ఎదురు తిరిగితే రౌడీలతో దౌర్జన్యం చేయిస్తారని ఆయన అన్నారు. ఇదొక్కటే కాదని, మణికొండలో నాలుగు ఎకరాల స్థలను కబ్జా చేశారని, తిరుమల సమీపంలో కొంత భూమి, ఇడుపలపాయలో అటవీ భూమి 750 ఎకరాలు కబ్జా చేశారని, వాటిపై టిడిపి పోరాటం చేస్తే వైయస్ కొంత భూమిని ప్రభుత్వపరం చేశారని చంద్రబాబు చెప్పారు. కాగా, బాధితురాలు నీరజా రావును చంద్రబాబు పరామర్శించి, వివరాలు తెలుసుకున్నారు.