మీరక్కడా... నేనిక్కడా.. ఎలా?: మంత్రులు, ఎమ్మెల్యేలపై బాబు సీరియస్
విజయవాడ: తాను విజయవాడలో ఉంటున్న స్థితిలో మంత్రులూ పార్టీ శాసనసభ్యులు హైదరాబాదులో ఉండడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్లు కనిపిస్తున్నారు. తాత్కాలిక రాజధానిని కూడా విజయవాడకు మారుస్తున్న క్రమంలో అందరూ విజయవాడకు మకాం మార్చాలని ఆయన కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు చాలా కాలంగా విజయవాడ నుంచి పాలన సాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే పార్టీ శాసనసభ్యులంతా హైదరాబాద్లో ఉన్నారు. దేవినేని ఉమామహేశ్వర రావువంటి కొద్ది మంది మంత్రులు మాత్రం మొదటి నుంచి కూడా విజయవాడలోనే ఉంటున్నారు.
చంద్రబాబు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలందరికి ఫోన్ చేసి - "నేను ఇక్కడ ఉండి.. మీరు హైదరాబాద్లో ఉంటే ఎలా?" అని అడిగినట్లు సమాచారం. మంత్రులు, ఎమ్మెల్యేలు హైదరాబాదులో ఉంటే సమన్వయ లోపం ఏర్పడుతుందని చెప్పినట్లు తెలిసింది.
పార్టీ నేతలు కూడా జూన్ కల్లా విజయవాడ వచ్చేయాలంటూ సూచించారని సమాచారం. ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో విజయవాడకు తాను మారుతున్నానని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం మీడియా సమావేశంలో చెప్పారు. వీలైనంత త్వరగా వచ్చేస్తామని మిగతా నేతలంతా చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది.