డైలామాలో చంద్రబాబు : 'ఆ కాపు మంత్రిపై వేటు వేద్దామా! వద్దా!'
విజయవాడ : ఏపీ కేబినెట్ విస్తరణ ఎప్పుడుంటుందో తెలియదు గానీ.. విస్తరణకు సంబంధించి ఎవరి లెక్కల్లో వారు మునిగిపోయారు. కేబినెట్ లో ఎవరికి చోటు దక్కుతుంది? ఎవరికి చోటు దక్కదన్న విషయాలను బేరీజు వేస్తూ.. మీడియాతో పాటు సొంత విశ్లేషణల్లో మునిగిపోయారు నేతలు. దీంతో విస్తరణకు సంబంధించి రోజుకో కథనం వార్తల్లో నానుతూనే ఉంది.
ఇక తాజాగా కేబినెట్ విస్తరణకు సంబంధించి తెరపైకి వచ్చిన వార్త ఏంటంటే.. 'ఓ కాపు మంత్రిపై చంద్రబాబు వేటు వేయబోతున్నారట'. ప్రస్తుతం ఇదే అంశంపై ఏపీ మంత్రుల్లోను అంతర్గతంగా వాడి-వేడి చర్చ జరుగుతుందన్న గుసగసలు వినిపిస్తున్నాయి. అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన బీసీ రిజర్వేషన్ల ఉద్యమం ఓవైపు తెరపై ఉండగానే.. ఇప్పుడు కేబినెట్ నుంచి సదరు కాపు మంత్రిని తప్పిస్తే.. కాపుల్లోకి తప్పుడు సంకేతాలు పంపించినట్టవుతుందన్న ఆందోళనలోను సీఎం చంద్రబాబు ఉన్నట్టుగా తెలుస్తోంది.
సదరు కాపుమంత్రినే టార్గెట్ చేయడానికి లోకేశ్ తో ఆయనకున్న విబేధాలు కూడా ఓ కారణమే అని చెప్పుకుంటున్నారు. పైకి కనిపించకపోయినా.. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతూ వస్తుందే కాబట్టే.. విషయాన్ని చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారన్న వాదన వినిపిస్తోంది. అయితే సదరు మంత్రిగారిపై వేటు పడకుండా చేయడానికి ఆయన వియ్యంకుడైన మరో మంత్రిగారు కూడా రంగప్రవేశం చేశారని తెలుస్తోంది.
అయితే ఎవరెన్ని చెప్పినా.. చంద్రబాబు మాత్రం సదరు కాపు మంత్రిపై వేటు వేసేందుకే సన్నద్దమవుతున్నారన్న చర్చ జోరందుకుంది. సదరు మంత్రి నిర్వహిస్తున్న శాఖపై కూడా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడం చంద్రబాబు ఏమాత్రం సహించడం లేదట. ఇక కాపు ఉద్యమం కూడా మరోసారి పోరుబాట పడుతుండడంతో.. ఇలాంటి సమయంలో కాపు మంత్రికి ఉద్వాసన పలకడం పార్టీకి నష్టం చేకూరుస్తుందనే వాదన కూడా లేకపోలేదు.
దీంతో సదరు మంత్రిపై చర్యలు తీసుకోవాలా? వద్దా? అనే అంశంపై చంద్రబాబు తీవ్ర డైలామాలో పడ్డారట. ఒకవేళ ఉద్వాసన ఖరారైతే మాత్రం కాపుల్లో పార్టీ మరింత అసంతృప్తిని మిగుల్చుకోవడం ఖాయం. మరిలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు అంతిమంగా ఎటువైపు మొగ్గుతారో వేచి చూడాలి.