ఏపీ సీఎం జగన్ కు చంద్రబాబు హెచ్చరిక .. ఇక పోరుబాటే అన్న బాబు
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరికలు జారీ చేశారు. టిడిపి శ్రేణులపై ఉన్మాదుల్లా దాడులు చేస్తున్నారన్న చంద్రబాబు పోలీసులు శాంతిభద్రతలను పరిరక్షించడం మానేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన చంద్రబాబు వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని తిట్టిపోశారు. వైసిపి పాలనలో జరుగుతున్న అరాచకాలపై మండిపడిన ఆయన. ముఖ్యమంత్రి వైయస్ జగన్ 32 రకాల ఉపాధి అవకాశాలను దెబ్బతీశారని చంద్రబాబు ఆరోపించారు.

పేదల కడుపుకొట్టి వైసీపీ నేతలు పొట్టలు పెంచుకుంటున్నారంటూ చంద్రబాబు ఆగ్రహం
రాష్ట్రానికి ఆర్థికంగా వనరులు చేకూర్చే కార్యకలాపాలకు జగన్ సర్కార్ తూట్లు పొడిచింది అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు చంద్రబాబు . ఈ టెలీ కాన్ఫరెన్స్ లో వైసీపీ పై నిప్పులు చెరిగారు ఆయన.
పేదల కడుపుకొట్టి వైసీపీ నేతలు పొట్టలు పెంచుకుంటున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడిన చంద్రబాబు ఇసుక కొరతపై ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని పార్టీ నాయకులకు, శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్ని జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని సూచించారు. ఏపీలో నెలకొన్న ఇసుక కొరత పై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేయాలని సూచించారు బాబు.తెలుగుదేశం పార్టీ హయాంలో డ్వాక్రామహిళలకు ఆదాయం వచ్చేలా ఇసుక పంపిణీ చేశామని చెప్పిన ఆయన ఆ తర్వాత ఉచితంగా ఇసుక అందుబాటులోకి తెచ్చినట్లు స్పష్టం చేశారు.

వాటాలేసుకుని మరీ ఇసుక దోపిడీ చెయ్యనున్నారన్న చంద్రబాబు
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక ధరలు చుక్కలనంటాయని ఆరోపించారు. నిర్మాణ రంగం కుదేలైంది అని,సిమెంట్ ధర కన్నా ఇసుక ధర ఎక్కువగా ఉందని, వైసీపీ నేతలకు లబ్ధి చేకూర్చడం కోసం ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకుందని ఆరోపించిన చంద్రబాబు ఎమ్మెల్యేలు, ఎంపీలు ,మంత్రులు వాటాలు వేసుకుని మరీ ఇసుక దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఇసుక కొరతతో 20 లక్షల మంది కార్మికుల పొట్ట కొట్టారని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సామాన్యులకు రక్షణ గా ఉన్నామని, వైసిపి పాలనలో అశాంతి ,అభద్రత భావం తో పాటు అరాచకం కూడా బాగా పెరిగిపోయిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు దౌర్జన్యాలే వైసీపీ ప్రభుత్వం టెర్రరిజానికి రుజువు అన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ టెర్రరిజం ఉందని ప్రముఖ వ్యాపార వేత్త మోహన్ దాస్ పాయ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు రాష్ట్రంలో అలాంటి పరిస్థితులే ఉన్నాయని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు దౌర్జన్యాలే వైసీపీ ప్రభుత్వం టెర్రరిజానికి రుజువు అంటూ బాబు మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నారని, భూములు సాగు చేయనివ్వడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిఇళ్లపై సామూహిక దాడులకు పాల్పడుతున్నారంటూ ధ్వజమెత్తారు.
బెదిరించి ఊళ్లనుంచి వెళ్లగొడుతున్నారని మండిపడ్డారు.తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలోవైసిపి అరాచకాలకు అంతే లేకుండా పోయిందని ఘాటుగా విమర్శించిన చంద్రబాబు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇక సమరమే అంటూ హెచ్చరిక జారీ చేశారు.












Click it and Unblock the Notifications