సర్వేపై బాబు: ఎమ్మెల్యేలకు షాక్!, అలా లేనిపక్షంలో.. వేరేవారికి ఛాన్స్
టీడీపీ సమన్వయ కమిటీ భేటీ :ఆంధ్రజ్యోతి ఫ్లాష్ టీమ్ సర్వే గురించి ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా ప్రస్తావించారు ఏపీ సీఎం చంద్రబాబు.
విజయవాడ: ఆంధ్రజ్యోతి ఫ్లాష్ టీమ్ సర్వేపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదు గానీ ఎమ్మెల్యేలపై మాత్రం అసంత్రుప్తి ఉందని పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు.
వెలగపూడి సచివాలయంలో బుధవారం నుంచి తన అధికారిక కార్యక్రమాలను ప్రారంభించిన చంద్రబాబు గురువారం నాడు పలు సమావేశాలు నిర్వహించారు. ఇందులో భాగంగా.. టీడీపీ సమన్వయ కమిటీ భేటీ జరిగింది. సమావేశంలో ఆంధ్రజ్యోతి నిర్వహించిన సర్వే గురించి చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. సర్వే ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించిందని.. అయితే రుణమాఫీ లాంటి పథకాలపై జనంలో ఉన్న అసంతృప్తికి కారణాలేంటో తెలుసుకోవాలని నేతలకు సూచించారు.
మునుపటితో పోలిస్తే.. ఎస్సీల్లో టీడీపీకి ప్రజాదరణ పెరగడం పట్ల చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు ఏ ఎమ్మెల్యేలపై అయితే అసంతృప్తిని వ్యక్తం చేశారో.. వారి పనితీరును మార్చుకోవాలని.. లేనిపక్షంలో వేరే వారికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు. 80శాతం మేర పనితీరు సంతృప్తిగా లేని ఎమ్మెల్యేలకు సీట్లు దక్కవని తేల్చి చెప్పారు. జనచైతన్యయాత్రలు జనానికి చేరువయ్యాయని చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు.
నోట్ల రద్దు కారణంగా బ్రేక్ పడిన సభ్యత్వ నమోదును మరో 15రోజుల పాటు పొడిగించాలని సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణలో నాలుగు లక్షల వరకే ఇప్పటిదాకా టీడీపీ సభ్యత్వ నమోదు జరగడం గమనార్హం. జనవరి 1నుంచి జన్మభూమి కార్యక్రమంలో పెన్షన్లు, రేషన్కార్డులుఇవ్వనున్నట్టు తెలిపారు.