ఛాన్సివ్వరా?: మంత్రులపై బాబు సీరియస్, హెచ్చరిక
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలువురు మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శనివారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులతో మాట్లాడుతుండగా మధ్యలో కల్పించుకుని కొందరు మంత్రులు మాట్లాడటంపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను మాట్లాడనివ్వకుండా మంత్రులు మాట్లాడటమేంటని ఆయన ప్రశ్నించారు.
ఇక మీదట అధికారులతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లకు మంత్రులు రావాల్సిన అవసరం లేదని తేల్చే చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో అధికారులకు అవకాశమివ్వకుండా మంత్రులు మాట్లాడటంపై చంద్రబాబు మండిపడ్డారు. అధికారులతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లకు మంత్రులు రావాల్సిన అవసరం లేదని, ఒక వేళ వస్తే మంత్రులు అధికారులు మాట్లాడటానికి సహకరించాలని అన్నారు.
కాగా, శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఓ అధికారి మాట్లాడుతుండగా కల్పించుకుని మంత్రి రావెల కిశోర్ బాబు మాట్లాడారు. అప్పటికే సిఎం చంద్రబాబు అధికారులకు అవకాశమివ్వాలని కోరారు. ఆయన మాట వినకుండా మంత్రి కిశోర్ మాట్లాడటం చంద్రబాబు సీరియస్ అయ్యారు. అధికారులకు అవకాశమివ్వాలని అన్నారు.
ఏ ప్రభుత్వ పథకంలో అవకతవకలు జరిగినా ఆయా శాఖల మంత్రులు, అధికారుల నుంచే వసూలు చేయడం జరుగుతుందని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. అంతకుముందు స్వయంసహాయక బృందాలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వయం సహాయక బృందాలు శ్రద్ధతో పని చేయాలని సూచించారు. దసరాలోపు పెన్షన్ లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని, పెన్షనర్ల ఎంపికలో వృద్ధులు, పేదలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇంత భారీగా పెన్షన్లు ఎప్పుడూ పెంచలేదని బాబు తెలిపారు. సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం చేయనున్నట్లు చెప్పారు.
అర్హులైన వారినే పథకాలకు ఎంపిక చేయాలని, ప్రశ్నించే అవకాశం కల్పించవద్దని సహాక బృందాలకు వివరించారు. అందరూ మనసు పెట్టి పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేస్తే సహించమని దీనిపై సంబంధిత అధికారి, కమిటీలే బాధ్యత వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.
మాతా శిశు సంరక్షణకు కృషిచేస్తామన్నారు. నిరుపేద గర్భిణీలకు అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పిస్తామన్నారు. అంగన్వాడీ కేంద్రాల పనితీరు మెరుగుపడాలని బాబు తెలిపారు. సంక్షేమ వసతి గృహాలను రెసిడెన్సియల్ స్కూళ్లుగా మార్చే అంశాన్ని పరిశీలించాలని, ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేయాలని అధికారులకు తెలిపారు.