మంత్రులకు చంద్రబాబు క్లాస్: కల్వకుంట్ల కవితపై కేసు
హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ మంత్రులకు క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది. రాజధాని తదితర అంశాల పైన మంత్రులను బాబు హెచ్చరించారని సమాచారం. సోమవారం ఏపీ మంత్రివర్గం సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమయంలో చంద్రబాబు రాజధాని అంశం గురించి మాట్లాడుతూ.. మంత్రులను హెచ్చరించారు.
రాజధానిపై విబిన్న ప్రకటనలు చేయొద్దని, ప్రజల్లో గందరగోళం సృష్టించవద్దని ఆయన మంత్రులకు హితవు పలికారు. రాష్ట్రం మధ్యలోనే రాజధాని ఉంటుందని చంద్రబాబు చెప్పారు. బడ్జెట్ సమావేశాలు జరిగే సమయంలో శాఖల పైన క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని బాబు సూచించారు. బడ్జెట్లో రుణమాఫీని ఏ ఖాతాలో చూపించాలనే దాని పైన మంత్రులతో బాబు చర్చించారు.
కాగా, ఈ నెల 18 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి రాజధానిలో గవర్నర్కు అధికారాల అప్పగింత అంశం పైన కేబినెట్లో చర్చ జరిగింది. రాష్ట్ర విభజన బిల్లుపై మరింత స్పష్టత కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 8, 9, 10 షెడ్యూల్స్ పై సమగ్ర చర్చ జరపాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించిన వాటన్నింటికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టాలని యోచిస్తున్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ పైన సుప్రీం తీర్పును కేబినెట్ స్వాగతించింది.
కల్వకుంట్ల కవిత పైన కేసు నమోదు
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పైన మాదన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు నమోదయింది. స్వాతంత్రం వచ్చాక కాశ్మీర్, తెలంగాణల పైన కవిత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ నేత కరుణాసాగర్ ప్రయివేటు పిటిషన్ దాఖలు చేశారు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదయింది.